మ్యాటర్ లేక పెద్ద ఫోటోలతో: సోనియాకు మోడీ కౌంటర్
రాజ్కోట్లోని ప్రచార సభలో సోనియా గాంధీ తనపై చేసిన విమర్శకు మోడీ ఘాటుగా జవాబిచ్చారు. సోనియా గాంధీ గతంలో ఉదయపూర్లో ప్రచారం నిర్వహిస్తే అక్కడ కాంగ్రెసు పార్టీ గల్లంతయిందని, ఇప్పుడు ఆమె రాజ్కోట్లో ప్రచార చేశారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెసు కనుమరుగు కావడం ఖాయమన్నారు. రాజ్కోట్లో అన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీయే గెలుస్తుందన్నారు.
గుజరాత్ గురించి మాట్లాడేందుకు సోనియా వద్ద ఏమీ లేదని, మాట్లాడితే అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని, విమర్శలు చేసే స్థాయిలో గుజరాత్ లేదని అన్నారు. సోనియాకు మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో స్థానిక పత్రికలు సోనియా ప్రచార సభను ఎలా కవర్ చేయాలో అర్థం కాక పెద్ద పెద్ద ఫోటోలతో పత్రికలలో ప్రచురించారని, మ్యాటర్ మాత్రం కొద్దిగా మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.
బుధవారం రాజ్కోట్ ఎన్నికల ప్రచార సభలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా నవంబర్ 4న హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్ 13, 17 తేదీల్లో గుజరాత్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20న ఫలితాలు వెలువడుతాయి.