వేలకోట్లని 74 కోట్ల లెక్క చెప్పారేం: జగన్
సిబిఐ జెడి లక్ష్మీనారాయణ కోర్టుకు హాజరయ్యారు. తొలుత జగన్ న్యాయవాది సుబ్రహ్మణ్యం తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన... జగన్ అరెస్టు అక్రమమని చెప్పారు. జగన్ నేరస్తుడు అని చెప్పడానికి సిబిఐ ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. అరెస్టు చేసి 130 రోజులు దాటిందని, అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందేనని అన్నారు.
ఒక పార్టీ అధినేత ఇన్న రోజులు జైలులో ఉండటం సరికాదన్నారు. జగన్ కాంగ్రెసులో ఉన్నంత కాలం ఎవరూ అతనిని అవినీతిపరుడు అని చెప్పలేదని, పిటిషన్ వేసిన శంకర రావు ఆ తర్వాత మంత్రి అయ్యారని, వీటిని అన్నింటిని చూస్తుంటే రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయన్నారు. బయటకు వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని చెప్పడం సరికాదన్నారు. శంకర రావు పిటిషన్ ఆధారంగా ఇదంతా జరిగిందన్నారు. కోర్టుకు రావాల్సిన వ్యక్తిని సిబిఐ ఉద్దేశ్య పూర్వకంగా అరెస్టు చేసిందని ఆరోపించారు.
కాగా గత శుక్రవారం సుప్రీం కోర్టులోని ఐదో కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రాగానే సిబిఐ తరఫు న్యాయవాది.. న్యాయవాది మారినందున తమకు కొంత వ్యవధి కావాలని కోరిన విషయం తెలిసిందే. పరాశరణ్ విజ్ఞప్తి మేరకు సుప్రీం కోర్టు బెయిల్ పైన విచారణను వచ్చే ఈ రోజుకి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ పిటిషన్ పైన విచారణ సెప్టెంబర్ 14నే ఉంది. అయితే సిబిఐ కౌంటర్ను పరిశీలించాలని భావించిన సుప్రీం కోర్టు విచారణను ఈ రోజుకు(సెప్టెంబర్ 28)కి వాయిదా వేసింది. గత శుక్రవారం న్యాయవాదులు మారారని చెప్పి పరాశరణ్ విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో మరోసారి ఇది వాయిదా పడింది.