షర్మిల అవుట్- రాహుల్ గాంధీ కోర్ టీమ్
రాజ్యసభ ఎన్నికల కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మొత్తం ఏడుమందితో కూడిన అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఉన్నారు. ఆయన తన సొంత రాష్ట్రం కర్ణాటక నుండి తిరిగి నామినేట్ అయ్యారు. ఈ అభ్యర్థుల ఎంపిక వెనుక పార్టీ విధేయత, అనుభవం, ఇత అంశాలతో పాటు, రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పెద్దలసభలోకి కొత్త ముఖాలను తీసుకురావాలనే లక్ష్యంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ కోర్ టీమ్ సభ్యురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మహిళల కోటా కింద ఆమెను ఎంపిక చేసింది ఏఐసీసీ. మధ్యప్రదేశ్ నుండి ఆమెకు టికెట్ లభించింది. దిగ్విజయ్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో ఆమెకు ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నాయకులలో ఆయనకు మాత్రమే ఈసారి అవకాశం దక్కకపోవడం గమనార్హం.

పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరాను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపుతున్నారు. పార్టీలతో తనకు సముచిత స్థానం దక్కట్లేదని, అనుభవానికి తగ్గట్టుగా అవకాశం దక్కట్లేదని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయనకు రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. ఆయన కూడా కర్ణాటక నుంచే నామినేట్ అయ్యారు.
వీరితో పాటు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ కూడా ఇక్కడి నుంచే రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆయన నియామకం వెనుక వ్యూహాత్మక నేపథ్యం ఉంది. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 102 స్థానాలను గెలుచుకుని సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ ను ఓడించింది. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
దివంగత కేంద్రమంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడైన మన్సూర్ అలీ ఖాన్ను అభ్యర్థిగా ఎంపిక చేయాలని సిద్ధరామయ్య కూడా గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. తమిళనాడు విషయానికొస్తే, ప్రవీణ్ చక్రవర్తికి రాజ్యసభ బెర్త్ ఖరారైంది. డీఎంకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీతో సమన్వయం చేసుకోవడంలో చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ తమకు దక్కిన ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడంతో ప్రవీణ్ చక్రవర్తికి అవకాశం దక్కింది.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, అధిష్టానం ఆమెకు అవకాశం ఇవ్వలేదు. పవన్ ఖేరా వైపు మొగ్గు చూపింది. షర్మిలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, గాంధీ కుటుంబానికి, అలాగే దివంగత ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఖేరాకే అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక్కడ అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications