నాలుగేళ్లలో వందల కోట్లు: సోనియా అల్లుడిపై కేజ్రీవాల్
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరు మోసిన డిఎల్ఎఫ్ సంస్థ రాబర్ట్ వాద్రాకు అతి తక్కువ ధరకు అత్యంత ప్రధానమైన భూమిని ఇవ్వడమే కాకుండా వడ్డీ లేని రుణం ఇచ్చిందని, ఆ ఆస్తి విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందని, వాద్రాకు ఆ సంస్థ 50 లక్షల రూపాయలకే ఇచ్చిందని ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్ ఆరోపించారు. రాబర్ట్ వాద్రా సోనియా గాంధీ కూతురు ప్రియాంకను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిఎల్ఎఫ్కు, రాబర్ట్ వాద్రాకు మధ్య అక్రమ లావాదేవీలు నడిచాయని వారు ఆరోపించారు. వాద్రా సంపద విలువ మూడేళ్లలో 600 రెట్లు పెరిగిందని వారు చెప్పారు.
దాదాపు ఐదేళ్ల క్రితం డిఎల్ఎఫ్ వాద్రాకు వడ్డీ లేకుండా 65 కోట్ల రూపాయల రుణం ఇచ్చిందని కాగితాల మేరకు ఉన్న 50 లక్షల రూపాయల విలువ చేసే వాద్రాకు చెందిన ఐదు కంపెనీలు ఆ రుణాన్ని డిఎల్ఎఫ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి వాడిందని వారు చెప్పారు. వాద్రా 2007, 2010 మధ్య కాలంలో వాద్రా 300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేశారని, వాటి విలువ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు.
హర్యానా వంటి కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టులకు ఉద్దేశించిన డిఎల్ఎఫ్కు కట్టబెట్టారని, డిఎల్ఎఫ్కు వాయువేగంతో ఆమోదాలు లభించాయని వారన్నారు. ఉదాహరణకు - ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో గల మాగ్నోలియా గృహ నిర్మాణ పథకంలో అతి తక్కువ ధరకు వాద్రా ఏడు ఆపార్టుమెంట్లు పొందారని వారన్నారు. ఈ ప్రాజెక్టుకు హర్యానా ప్రభుత్వం డెవలపర్కు 350 ఎకరాల భూమిని కేటాయించిందని వారు చెప్పారు. ఇందులో క్విడ్ ప్రోకో చోటు చేసుకుందని వారు ఆరోపించారు.
వాద్రా 2012లో ఆరు కొత్త కంపెనీలను రిజిష్టర్ చేశారని వారు చెబుతూ ఈ కంపెనీలకు నిధులు వచ్చే మార్గాలేవని అడిగారు. కాంగ్రెసు పార్టీకి అక్రమంగా వస్తున్న డబ్బులను ఆస్తుల కొనుగోలులో పెడుతున్నారని వారు ఆరోపించారు. వాద్రా ఐటి నింబధలను ఉల్లంఘించారని వారు విమర్శించారు. వాద్రా ఆస్తులపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు.