బాబుయాత్రలో 6రోజులుగా బుడతడు: సాక్షిపైటిడిపి ఫైర్
హైదరాబాద్/అనంతపురం: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర్రెడ్డి పాదయాత్రను, ఇటీవల జగన్ ఓదార్పు యాత్రను తమ పార్టీ ఏనాడూ విమర్శించలేదన్నారు.
కానీ చంద్రబాబు పాదయాత్రపై జగన్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాయితీలతో జగన్ మీడియా నడుస్తోందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కరపత్రంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు దళిత వాడల్లో పర్యటించినా, రహదారి వెంట టీ తాగినా దానిపై జగన్ మీడియాలో చేస్తున్న ప్రచారం తీరు చూస్తుంటే అక్కడి ప్రజలను, మహిళలను వారు అవమానిస్తున్నట్లుగా ఉందన్నారు. వారివన్నీ పిచ్చిరాతలు, కారుకూతలు అని ధ్వజమెత్తారు.
జగన్కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు జడ్జి ప్రశ్నిస్తే దానిపై వ్యాసాలను జగన్ మీడియాలో ఎందుకు రాయడం లేదన్నారు. జగన్ మీడియా సంస్థలపై ఇప్పటికే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేశామని, మరోసారి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఆర్ఎల్డి శాఖను అజిత్ సింగ్ ఏర్పాటు చేయడంలో కొత్తదనం లేదన్నారు. బాబు పాదయాత్రకు ప్రజలతో పాటు ప్రకృతి ఆశీర్వాదం కూడా లభించిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు.
బాబు యాత్రలో చిన్నపిల్లాడు
అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు యాత్రలో ఆయన వెంటే ఓ బుడతడు కనిపిస్తున్నాడు. అతడి పేరు అరవింద్. రెండో తరగతి చదువుతున్నాడు. వయస్సు పదేళ్ల లోపు. కానీ, ఆరు రోజులుగా బాబు వెంట పాదయాత్రలో పాల్గొంటున్నాడు.ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన ఈ బుడతడు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చంద్రబాబు సిఎం కావాల్నదే తన ఆకాంక్ష అని ఆ పిల్లాడు చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటుంది.