చుక్కెదురు: మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిలకు నో బెయిల్
వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉందని సిబిఐ అంటూ వారికి బెయిల్ ఇవ్వకూడదని కోర్టును కోరింది. అయితే, తాము రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే వాన్పిక్ వ్యవహారంలో నడుచుకున్నామని, తాము ఏ విధమైన తప్పు చేయలేదని వారిద్దరు చేసిన వాదనను సిబిఐ వ్యతిరేకించింది.
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు అనుకూలంగా వాన్పిక్ వ్యవహారంలో మేలు చేస్తూ వారిద్దరు నిర్ణయాలు తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రిగా వ్యవహరించారు. బ్రహ్మానంద రెడ్డి ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఇదే కేసులో మరో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ న్యాయం, మోపిదేవికి మరో న్యాయమా అని మోపిదేవి తరఫు న్యాయవాది అడిగారు.
వైయస్ జగన్కు సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. మరో ఆరు నెలల పాటు బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా నిమ్మగడ్డ ప్రసాద్కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలను కోర్టు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, వారి రిమాండ్ను ఈ నెల 25వ తేదీ వరకు పొడగించింది.