టార్గెట్ తెలంగాణ: జైలునుండే జగన్ వ్యూహం, సర్వేలతో

అయితే ఆ లోపే అతను తన అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. అంతకుముందు వరంగల్ జిల్లా మహబూబాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణవాదులు అతనిపై రాళ్ల దాడి చేశారు. లోకసభలో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నందుకు అతనిని రాకుండా అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. నిజామాబాద్లో జగన్ దీక్షకు, సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేనేత దీక్షకు మంచి స్పందన వచ్చింది.
దీంతో తెలంగాణ ప్రాంతంలో పాగా వేసేందుకు జగన్ రెడీ అయ్యారు. ఇటీవల పరకాల ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి ముచ్చెమటలు పోయించింది. టిడిపి, కాంగ్రెసు, తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపిని కాదని పరకాల ప్రజలు కొండా సురేఖకు భారీగా ఓట్లు వేశారు. దీంతో టిఆర్ఎస్ కేవలం పదిహేను వందల పై చిలుకు ఓట్లతో మాత్రమే గట్టెక్కింది. మహబూబాబాద్ పర్యటనలో అడ్డంకి ఎదురైనప్పటి నుండి పరకాల ఉప ఎన్నిక వరకు చూస్తే జగన్ పార్టీ పరిస్థితి తెలంగాణలో చాలా మెరుగుపడింది.
ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైయస్ విజయమ్మ, షర్మిలలకు ఎక్కడా అడ్డంకులు ఎదురు కాలేదు. దీంతో ఇప్పటికే సీమాంధ్రలో తన సత్తా చాటుకున్న జగన్ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఆయన జైలు నుండే వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాలలో సర్వేలు చేసి, వాటి ఆధారంగా ఎవరికి పట్టు ఉంటే వారిని తమ వైపుకు లాక్కునే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారట. ఇటీవలి కాలంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు జగన్ను జైలులో కలవడమో లేక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను కలవడమో చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ వరుసగా రెండోసారి అధికారానికి దూరమైన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు అసంతృప్తి నేతలు జగన్ వైపుకు వెళ్లేందుకు తక్షణమే సిద్దమయ్యారు. సోమవారం నల్గొండ జిల్లా సీనియర్ టిడిపి నేత సంకినేని వెంకటేశ్వర రావు జైలులో జగన్ను కలిశారు. అయన దసరా పండుగలోగా జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. కాంగ్రెసు పార్టీలో కూడా చాలామంది జగన్ వైపుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికారంలో ఉండటంతో తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట.












Click it and Unblock the Notifications