జైలుకు పంపిస్తా: బాబు, కాలి బొబ్బలతోనే పాదయాత్ర

Chandrababu Naidu
అనంతపురం: తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెసు నేతలు అడవి పందుల్లా మేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షన్నర కోట్ల బడ్జెట్ స్వాహా చేశారన్నారు. గుక్కెడు నీరు, సరిపడా కరెంటు, నడవడానికి రోడ్లు ఇలా ప్రజల కోసం అవసరమైన పని ఏదీ చేయడం లేదన్నారు. ఎందుకోసం పాలన సాగిస్తున్నారో అర్థం కాదని నిప్పులు చెరిగారు. అక్రమార్కుల భరతం పట్టడానికే పాదయాత్ర చేపట్టానని ప్రకటించారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ప్రజలను చులకనగా చూస్తున్న కాంగ్రెస్ పాలకులారా.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలను వెలికి తీసి, స్వాహా చేసినవారిని జైలుకు పంపుతానని వ్యాఖ్యానించారు. సోమవారం ఏడోరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం కుర్లపల్లి క్రాస్ నుంచి చంద్రబాబు తన పాదయాత్రను ప్రారంభించారు. రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. బోయలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోమవారం ఏకంగా 12 గంటలపాటు పాదయాత్ర చేసి, 21 కిలోమీటర్లు ప్రయాణించి, నారాయణపురం క్రాస్ వద్ద బస చేశారు.

రైతులు, మహిళల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. తమ హయాంలో రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేసి, సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసే అడవి పందుల తరహాలో కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర సంపదను దోచేశారని మండిపడ్డారు. రైతు కష్టాలను తెలుసుకోవాలనే పాదయాత్ర చేపట్టానన్నారు.

మంత్రి రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు ఉండటం శోచనీయమన్నారు. భవిష్యత్తులో రైతులకు కష్టాలు, కన్నీళ్లు ఉండవని అభయమిచ్చారు. రైతుల పక్షాన పోరాటాలు చేసి, నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామన్నారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. రైతుల కోసం ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేసేది టిడిపినే అన్నారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.

తాను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, తన అంత అనుభవం ఉన్న నాయకులు ఎవరూ లేరన్నారు. అందుకే గత ఎన్నికల్లో నగదు బదిలీ వంటి వినూత్న పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టానని చెప్పారు. ఇందిరమ్మ పథకాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే ఇక అప్పుల పాలు కావాల్సిందేనని, ఉపాధి హామీ పథకాన్ని దారి మళ్లించి కాంగ్రెస్ నాయకులు పంది కొక్కుల్లా మేశారని మండిపడ్డారు. నేరుగా ప్రజల కష్టాలను తెలుసుకొని వారికి అనుకూలమైన పథకాలను రూపొందించాలన్న ఆశయంతో పవిత్ర యాత్రకు సిద్ధమయ్యానని, నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

కాగా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాలుగు రోజులుగా కాలి బొబ్బలతో బాధ పడుతూనే ముందుకు కదులుతున్నారు. ఆయన రెండు కాళ్లకు నాలుగు చోట్ల బొబ్బలు వచ్చాయి. వాటికి వైద్యం చేయించుకుంటూనే యాత్రను సాగిస్తున్నారు. ఉదయం యాత్ర ప్రారంభానికి ముందు, మధ్యాహ్న భోజన సమయంలో, రాత్రి బొబ్బలకు మందు రాసి, ఐస్ ముక్కలు పెడుతున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+