అత్యాచారాలపై సోనియా గాంధీ ఫైర్: 'ఖాప్'కు హెచ్చరిక
ఇలాంటి ఘటనలు కేవలం హర్యానాకే పరిమితం కాలేదని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడాకు సూచించారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
పర్యటన సమయంలో సోనియా వెంట ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెసు నేతలు పలువురు ఉన్నారు. కాగా హర్యానాలో మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతున్నాయి. జింద్ జిల్లా, నర్వానా డివిజన్లో ఒక దళిత బాలికపై ఇద్దరు యువకులు శనివారం అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో షాక్కు గురైన ఆ బాలిక కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బాధిత కుటుంబాన్ని సోనియా గాంధీ పరామర్శించారు. అత్యాచారాలు నిరోధించిందుకు పెళ్లి వయస్సును తగ్గించాలన్న ఖాప్ పంచాయతీ తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. చట్టం ప్రకారమే అందరూ నడుచుకోవాలని హెచ్చరించారు. హర్యానాలో నెల రోజుల వ్యవధిలో 13 అత్యాచార కేసులు నమోదు కావడం గమనార్హం.