బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే కు 4 గిన్నిస్ రికార్డులు..! ఇదో చరిత్ర..!
బెంగళూరు-విజయవాడ కారిడార్ (Bengaluru–Vijayawada Highway) నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం ఒకే వారంలో, ఒకే కారిడార్ ప్రాజెక్ట్లో భారత్ అసాధారణంగా నాలుగు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. రహదారులను ఎంత వేగంగా, సమర్థవంతంగా నిర్మించవచ్చో ప్రపంచానికి చూపించింది. బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో తనదైన ముద్ర వేసింది. అలాగే నిర్మాణ రంగంలో భారత్ సామర్థ్యాన్ని నిరూపించింది.
ఐటీ బెంగళూరు, ఏపీలో కీలక వాణిజ్య కేంద్రమైన విజయవాడ మధ్య దూరం కేవలం 635 కిలోమీటర్లే అయినా ప్రయాణానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. రద్దీగా ఉండే పట్టణాలు, వంకర రహదారులు, నేరుగా ఎక్స్ప్రెస్ వే లేకపోవడం వల్ల దక్షిణాదిలో ఇది అత్యంత నమ్మశక్యం కాని ప్రయాణాల్లో ఒకటిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా తెరపైకి వచ్చిందే బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ వే. ఈ కారిడార్ పూర్తికాగానే, బెంగళూరు మరియు విజయవాడ మధ్య ప్రయాణ దూరం 635 కిలోమీటర్ల నుండి కేవలం 535 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంతేకాకుండా, సుమారు 12 గంటల ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గుతుంది.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లను కలుపుతూ నిర్మాణంలో ఉన్న NH-544G బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్గా అధికారికంగా గుర్తించారు. ఇది 518 కిలోమీటర్ల పొడవైన, ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే. ప్రతిష్టాత్మక భారత్మాల కార్యక్రమంలో ఇది ఒక కీలక భాగం. ఈ హైవేపై ట్రాఫిక్ లైట్లు లేవు, క్రాసింగ్లు లేవు, గ్రామీణ రహదారులపై నెమ్మదిగా వెళ్లే ట్రక్కుల సమస్య లేదు. ఈ కారిడార్ ఏపీలోని రాయలసీమ ప్రాంతం గుండా వెళుతుంది. చారిత్రికంగా తక్కువ కనెక్టివిటీ ఉన్న రాయలసీమకు ఈ రహదారి ఒక జీవనాడి. దీని రాకతో కడప, కర్నూలు జిల్లాలకు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలకు వ్యవసాయ మార్కెట్లు, లాజిస్టిక్స్ పార్కులకు యాక్సెస్ దొరుకుతుంది. ఎలక్ట్రానిక్స్, ఆహార శుద్ధి వంటి రంగాలలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది దోహదపడుతుంది.
2026 జనవరిలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాయి. జనవరి 6న పుట్టపర్తి సమీపంలో 24 గంటల్లో నిరంతరాయంగా 9.63 కిలోమీటర్ల పొడవైన, మూడు లేన్ల బిటుమినస్ కాంక్రీటును వేయడం ద్నారా రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి పొడవైన నిరంతర లేయింగ్ రికార్డు. రెండో రికార్డు 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును 24 గంటల్లో నిరంతరాయంగా వేయడం. ఇది దాదాపు 1,400 పెద్ద ఏనుగుల బరువుకు సమానం. కేవలం ఒక్క రోజులో ఈ పని పూర్తయింది. అలాగే జనవరి 11న మరో రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. నిరంతరాయంగా 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును వేయడం, అలాగే 156 లేన్ కిలోమీటర్ల (3-లేన్ వెడల్పు, 52 కిలోమీటర్ల విభాగం) నిరంతర పేవింగ్ పూర్తి చేయడం. ఇది గత ప్రపంచ రికార్డు అయిన 84.4 లేన్ కిలోమీటర్లను బద్దలుకొట్టింది. ఈ విధంగా, ఒక వారంలోపే, భారతదేశం ఒకే కారిడార్పై మొత్తం నాలుగు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.












Click it and Unblock the Notifications