తెలంగాణపై నో డెడ్లైన్, బాబుకు భయమా: కెటిఆర్
విద్యార్థులు, ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలని లేదంటే టిఆర్ఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందన్నారు. అందుకే ఉద్యమకారులను ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చగొడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రభుత్వంలో ఏ శాఖ ఏం చేస్తుందో ఎవరికీ తెలియడం లేదన్నారు. పారదర్శక పాలనకు కిరణ్ పాతర వేశాడని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేసిందే కెసిఆర్ అన్నారు. లోటుపాట్లను సవరించుకొని ఐకాసతో కలిసి పని చేస్తామని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ సాధన కోసం జెఏసిని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీ స్వార్థం కోసమే అయితే జెఏసిని ఏర్పాటు చేసి ఉండేవాళ్లమే కాదన్నారు.
చంద్రబాబుపై విమర్శలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేటు వయస్సులో ప్రజలపై ఘాటు ప్రేమ కలిగిందని ఎద్దేవా చేశారు. ఆయన తన పాదయాత్రకు వస్తున్నా మీకోసం కాకుండా చస్తున్నా కుర్చీ కోసం అని పెట్టుకుంటే బాగుండేదన్నారు. తన హయాంలో చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే ఐఎంజి కేసులో సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాబు ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తే వెంటనే విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.