కాంగ్రెస్‌కు లాంతర్, జగన్‌కు జైలు కేటాయిస్తే: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
కడప/రాజమండ్రి: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి, అక్రమాల పాలనే కొనసాగిస్తుందని, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరో అడుగు ముందుకేసి విద్యుత్ లేకుండా చేసి చీకటి రాజ్యం సృష్టిస్తున్నారని ఈయన పాలనలో విద్యుత్‌కు కటకట ఏర్పడితే.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని జైళ్లు కిటకిటలాడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి బుధవారం ఎద్దేవా చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌కు లాంతర్, జగన్ కాంగ్రెస్‌కు జైలు గుర్తులు కేటాయిస్తే ప్రజలకు స్పష్టత ఇచ్చినట్లవుతుందని విమర్శించారు. కడపలో బుధవారం టిడిపి జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సోమిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కిరణ్ అన్నింటా కోతల పాలనను కొనసాగిస్తున్నారన్నారు. మతిచలించి ఆయన పిచ్చిపిచ్చి ప్రకటనలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుపై సిబిఐ విచారణ జరుపుతుందని అనడం ముఖ్యమంత్రి నిగ్రహం కోల్పోయారనడానికి నిదర్శనమన్నారు.

వైయస్ హయాంలో ఎన్నో కేసులు, విచారణ కమిటీలు వేసినా చంద్రబాబును ఏమి చేయలేకపోయారన్న సంగతి గుర్తుంచు కోవాలన్నారు. బాబుపై వైయస్ విజయమ్మ వేసిన కేసును కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. ఎవరి నిర్వాకం వల్ల నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు పలువురు జైళ్ళల్లో మగ్గుతున్నారో విజయమ్మ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

అక్రమాస్తులను ఇప్పటికైనా ప్రభుత్వపరం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే కొద్దిగానైనా జగన్‌కు పుణ్యం దక్కుతుందన్నారు. సోనియా అల్లుడి గురించి మాట్లాడుతూ, వాద్రా మరో జగన్‌లా అవతరించారన్నారు. బాబు పాదయాత్రకు సంఘీభావంగా నెల్లూరు జిల్లాలో నవంబర్ ఒకటి నుంచి రెండు నెలల పాటు తామూ పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ, చంద్రబాబు పాదయాత్రకు దేశంలో ఎప్పుడూ ఎక్కడా ఎవరికీ రాని స్పందన లభిస్తోందన్నారు.

అవినీతిని పెంచి పోషించడంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు దొందూదొందేనని, వైయస్సార్ కాంగ్రెసు పిల్ల కాంగ్రెస్ అని టిడిపి నేత ఎర్రన్నాయుడు ఎద్దేవా చేశారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్ పార్టీ నాయకులు, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఐఎంజీ విషయంలో చంద్రబాబుపై పెట్టిన నాలుగు కేసులను వివిధ కోర్టులు ఇప్పటికే కొట్టేశాయన్నారు.

తాజాగా ముఖ్యమంత్రి కోర్టులనే ప్రభావితం చేసేలా సిబిఐ ఎంక్వైరీ జరగబోతుందంటూ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ పార్టీలో సంబంధం లేదని చెబుతున్నా ప్రధాని, కేంద్ర మం త్రులు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపకుండా ఎందుకు వంత పాడుతున్నారని ప్రశ్నించారు. ఏమాత్రం అవినీతి బురద అంటని నాయకుడు చంద్రబాబునాయుడని, ఏదోవిధంగా బురదజల్లి ఆయన్ని అపఖ్యాతిపాలు చేయాలని కాంగ్రెస్, వైసీపీలు కుటిలయత్నాలు చేస్తున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+