విక్టోరియా హోంపై ముంబై మాపియా కన్ను: ఫిర్యాదు

టీవీ చానెళ్ల కథనం ప్రకారం - పాండే అనే వ్యక్తి మ్యుటేషన్ కోసం రెండు రోజుల క్రితం ఎమ్మార్వోను కలిశాడు. 18 ఎకరాలకు సంబంధించి పాండే నకిలీ పత్రాలు, పాస్ పుస్తకాలు సృష్టించినట్లు తెలుస్తోంది. ఆ భూమిని 2009 - 2011 మధ్య కాలంలో పాండేకు విక్రయించినట్లు పత్రాలను సృష్టించారు. మ్యుటేషన్ కోసం వచ్చిన పాండేకు తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని చెప్పి, ఎమ్మార్వో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పాండే వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని గుర్తించారు.
నకిలీ పత్రాలతో విఎం హోమ్కు చెందిన 18 ఎకరాల భూమిని పాండే 450 కోట్ల రూపాయలకు ఖుర్షీద్ అనే వ్యక్తికి అమ్మడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. విక్టోరియా మెమోరియల్ హోం (విఎం హోమ్) సరూర్నగర్ మండలంలోని కొత్తపేటలో ఉంది. ఈ భూమి నిజాం ప్రభువుకు చెందింది. దాంట్లో మీర్ మహబూబ్ అలీఖాన్ పేరు మీద పాఠశాల ఏర్పాటైంది.
నిజానికి, గతంలోనే నిజాం ఆ భూములను నిజాం తనకు రాసిచ్చాడంటూ స్థానిక నాయకులు చాలా మంది కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు. ఈ స్థితిలో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఆ హోమ్లో ఆశ్రమ పాఠశాల నడుస్తోంది. నకిలి పత్రాలను గుర్తించిన తర్వాత ఎమ్మార్వో పాండే ఎవరనేది కనుక్కోవడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరో నిజాం 1903లో ఆ హోమ్ను నిర్మించాడు.












Click it and Unblock the Notifications