మహంకాళి ఆలయ చోరీ సాహు గ్యాంగ్ పనేనా?

రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో చోరీకి పాల్పడిన సాహూ అనే వ్యక్తిని హైదరాబాదులోని ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి మల్కాజిగిరిలోని మహాలక్ష్మి జ్యువెల్లరీ షాపులో దొంగతనం చేస్తుండగా అతను ఉప్పల్ పోలీసులకు చిక్కాడు. షాపు షట్టర్ కోసి దొంగతనం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
విజయవాడలోని దుర్గ గుడిలో, అరసవిల్లి దేవాలయంలోనూ సాహూ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని, హైదరాబాదు శివారులోని పలు దేవాలయాల్లో కూడా అతను చోరీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మహంకాళి ఆలయంలో అతను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ, అతని ముఠా అ పనికి ఒడిగట్టి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాదు, సైబరాబాద్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో సాహూపై 30కి పైగా చోరీ కేసులు నమోదై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నగర శివారుల్లోని మీయాపూర్, జీడిమెట్ల, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో అతను దొంగతనాలు చేసినట్లు భావిస్తున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మవారి నగలను ఇటీవల దోచుకున్నారు. దొంగతనంపై అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం చెప్పారు.












Click it and Unblock the Notifications