షర్మిల పాదయాత్రపై బాబు ఫైర్, ఒత్తిడికేనని వ్యాఖ్య
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చిన్నహోతారు గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఢిల్లీలో బేరసారాలకు దిగుతారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీది బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలపై తాము వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై కూడా తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు.
తమ 9 ఏళ్ల పాలనలో వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కసారి కూడా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించలేదని చంద్రబాబు అన్నారు. తాము అవిశ్వాస తీర్మానం పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులను కొనుగోలు చేస్తుందని అన్నారు. శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాపాల్లో తాము భాగం కాదలుచుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని కోరుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వితంతువులకు, వృద్ధులకు రూ. 600 పింఛను సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.