షర్మిల పాదయాత్ర: ఆరు నెలలు, రోజుకు 18 కిమీ
ప్రతి రోజు ఆమె 18 కిలోమీటర్ల మేర నడక ప్రారంభిస్తారు. ఆ రకంగా ఆమె ఆరు నెలల పాటు పాదయాత్ర సాగిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆమె పాదయాత్ర ముగుస్తుంది. పాదయాత్ర పేటెంట్ హక్కు వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానిదేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి శనివారం ఇడుపులపాయలో మీడియా ప్రతినిధులతో అన్నారు .
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే షర్మిల ప్రజా ప్రస్థానం చేపడుతున్నట్లు తెలిపారు. చరిత్రలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన చరిత్ర షర్మిలకే దక్కుతుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రజలను ప్రభుత్వం రాబందులా పీక్కు తింటోందని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్సార్ ఆశయాలను, లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.
పదవి కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్రను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంతకు ముందు వైయస్సార్ సమాధిని సందర్శించి అంజలి ఘటించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు భూమా నాగిరెడ్డి, శానససభ్యులు అమర్నాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గండికోట శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి సహా పలువురు వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.