మంత్రులకు న్యాయసహాయం: వాదన వినిపించుకోండి
ఒడిశాకు చెందిన దేబ్రా అనే వ్యక్తి ప్రభుత్వం మంత్రులకు న్యాయసహాయం అందించాలన్న జివోలపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. సంబంధిత బెంచులోనే మీ వాదన వినిపించాలని పిటిషనర్కు సూచించింది. 26 జివోలకు దీనిని జత చేయాలని ఆదేశించింది. గతంలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది కేసులో ఇంప్లీడ్ కావాలని సూచించింది.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి 26 జివోలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వీటిని జారీ చేసిన ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు.
వీరికి సుప్రీం నుండి నోటీసులు జారీ కావడంతో ప్రభుత్వం న్యాయసహాయం అందించేందుకు జీవోలు జారీ చేసింది. దీనిపై అతను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అంతకుముందు వివాదాస్పద 26 జివోలకు సంబంధించి సంబంధిత మంత్రులను కూడా విచారించాలని సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.