ప్రధాని విజిట్: తెలంగాణ మీడియాకు నో పర్మిషన్
డిజిపి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకే తాము తాము అనుమతించడం లేదని భద్రతాధికారులు చెప్పారు.ఈ సంస్థల్లో నేరుగా టీన్యూస్, నమస్తే తెలంగాణ మీడియా సంస్థలు తెలంగాణకు అనుకూలంగా వార్తలు, వార్తాకథనాలు ఇస్తుండగా, వీ6, హెచ్ఎంటివీ మాత్రం యజమానులు మాత్రమే తెలంగాణకు సంబంధించినవారు.
జీవ వైవిధ్య సదస్సుకు వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన కవరేజీలో వివక్షతో తెలంగాణ జర్నలిస్టులకు పాసులు తిరస్కరించడాన్ని నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకుడు అల్లం నారాయణ ఖండించారు. దాన్ని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అది పాలకుల మూర్ఖత్వపు చర్య అని ఆయన అన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన డిజిపిని కోరారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సంఘం కూడా ఆ చర్యను ఖండించాయి.
తెలంగాణ మీడియా సంస్థల ప్రతినిధులకు పాసులు నిరాకరించడాన్ని నమస్తే తెలంగాణ దినపత్రిక సిఇవో కట్టా శేఖర రెడ్డి ఖండించారు. దాన్ని ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఫేస్బుక్లో తన వ్యాఖ్యలను పోస్టు చేశారు. ఇది నైతిక విలువలను కాలరాయడమేనని ఆయన అన్నారు. అధికార దురహంకారంతోనే ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
హైదరాబాద్లో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఆయన హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి జీవ వైవిధ్య సదస్సుకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.