భార్యకు శీల పరీక్ష చేసిన భర్త, కాగే నూనెలో చేతులు
వివరాలు ఈ విధంగా ఉన్నాయి - ఈ మధ్య భార్య ప్రియ ప్రవర్తనపై భర్త పోలయ్య అనుమానం పెరిగింది. దాంతో ఆమెను వేధించడం సాగించాడు. ప్రియతో మాట్లాడాడని ముసలిపేడుకు చెందిన ఓ యువకుడిని బుధవారం పోలయ్య చితకబాదాడు. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్చారు. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని భార్య ప్రియను కూడా పోలయ్య తీవ్రంగా కొట్టాడు. బుధవారం రాత్రి కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
శీలపరీక్షకు సిద్ధం కావాలని పెద్దలు కూడా ప్రియను ఆదేశిస్తూ తీర్మానించారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామ సమీపంలో ఉన్న మూటాలమ్మ ఆలయంలో శీల పరీక్ష నిర్వహించాలని నిర్ణయించి, రెండు గంటలకు ముహూర్తం కూడా పెట్టారు. అక్కడ ఆలయ ప్రాంగణంలో ఓ మూకుడులో నూనె బాగా వేడి చేసి ఆ నూనెలో చేతులు పెట్టి పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని ప్రియను ఆదేశించారు. కుల పెద్దల ఆదేశాల మేరకు ప్రియ ఆ నూనెలో చేతులు పెట్టింది. పచ్చాలమ్మ సాక్షిగా తాను ఏ తప్పు చేయలేదని పెద్దలకు విన్నవించుకుంది.
ఇది కలి యుగం కాబట్టి, ప్రియ సీతమ్మ లాంటి దేవత కాదు కాబట్టి ఆమె చేతులు బొబ్బలెక్కాయి. దీంతో ఆమె చేతులకు ఓ బట్ట చుట్టారు. అక్కడి నుంచి మళ్లీ ఏర్పేడు మండలం ముసలిపేడుకు వెళ్లారు. గురువారం రాత్రి మళ్లీ పంచాయితీ నిర్వహించారు. ప్రియ పాతివ్రత్యం నిరూపించుకున్నందుకు పోలయ్యకు జరిమానా వేయాలని కులపెద్దలు తీర్మానించారు.