రాజన్న రాజ్యానికి షర్మిల హామీ: మాట్లాడని విజయమ్మ
పలు చోట్ల ఆమె మాట్లాడారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు గ్రామాన్ని యూనిట్గా తీసుకొని పంటల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు మెస్ చార్జీలుగా రూ.40 ఇవ్వాలని డిమాండ్ చేశారు. "సీఎం కిరణ్ నిద్రపోతున్నాడా? నిద్ర నటిస్తున్నారా? నిద్రపోతే లేపగలం. నిద్ర నటించే వారిని లేపలేం కదా! కిరణ్కు ముందు చూపు లేదు. రైతులను ఆదుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు" అని ఆమె దుమ్మెత్తిపోశారు.
వైయస్ రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వాన్ని నడపడంలో కిరణ్కు ముందుచూపు లేకపోవడం వల్లే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రైతులంటే చిన్నచూపు అని ఆమె అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు తోడు దొంగల పార్టీలని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జీవితమంతా అంధకారమేనన్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తిలేక పాదయాత్రలతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు.
రాజన్న సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే జగనన్నకు పట్టం కట్టాలని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను రూ. 200ల నుంచి రూ. 600లకు పెంచుతామన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వేధిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వేధిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దుర్భిక్షం నెలకొని రైతులు, ప్రజలు, వ్యవసాయ కూలీలు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తుంటే ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె అన్నారు. ఏ ప్రాంతంలో పర్యటించినా కరెంట్, తాగునీటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
విద్య, వైద్యం, 108, 104 సంక్షేమ పథకాలను మచ్చుకైనా అమలు చేయడం లేదని ఆమె ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ధైర్యం లేక పాదయాత్రలతో ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నిలదీయడమే తన పాదయాత్ర లక్ష్యమన్నారు. చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అని ప్రకటించి నేడు రైతుల ముందు నటిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.