నేదురుమల్లికి చెక్ పెట్టిన ఆనం బ్రదర్స్, కిరణ్కు షాక్?

మూడు దశాబ్దాలకు పైగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి, ఆనం సోదరుల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇరువర్గాలు జిల్లాలో తమ పట్టు కోసం ఎప్పటికి అప్పుడు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తుంటాయి. నేదురుమల్లి కొంతకాలం వరకు జిల్లాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు ఆయన వయస్సు సహకరించడం లేదు. అయితే ఆ బాధ్యతను ఆయన సతీమణి రాజ్యలక్ష్మి భుజనకెత్తుకున్నాు.
2009 వరకు తమ క్యాడర్ను నేదురుమల్లి వర్గం బాగానే కాపాడుకుంటూ వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజ్యలక్ష్మి ఓటమి చవి చూశారు. అప్పటి నుండి నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ హవా కొనసాగుతోంది. తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా రాష్ట్రంలో హవా కొనసాగిస్తుండగా.. అన్న ఆనం వివేకానంద రెడ్డి జిల్లాల్లో ఎప్పుడూ తిరుగుతూ తమ వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి ఆనంకు మధ్య కొద్దిగా పొరపొచ్చలు వచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో జిల్లాలో ఆనం బ్రదర్స్ హవా తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా ముఖ్యమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి మహిళా చైర్ పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే అనం సోదరులు కూడా అంతే ధీటుగా చక్రం తిప్పి రాజ్యలక్ష్మికి పదవి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
మూడేళ్లుగా పదవి లేక క్యాడర్ను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్న నేదురుమల్లికి మహిళా చైర్ పర్సన్ పదవి ఓ వరంలా వచ్చింది. అయితే నోటికాడికి వచ్చిన ముద్దను తన్నుకుపోయిన చందంగా పదవి ఖరారు అయిన తర్వాత దానిని ఆనం బ్రదర్స్ అడ్డుకున్నారని చెబుతున్నారు. నేదురమల్లి రాజ్యలక్ష్మికి పదవి వస్తే జిల్లాలో తమ హవా తగ్గుముఖం పడుతుందనే ఆందోళనతో, రాజకీయ వైరం కారణంగానే వారు అడ్డుకున్నారని అంటున్నారు.
కేంద్ర సహాయ మంత్రి కూడా రాజ్యలక్ష్మికి పదవి రాకుండా చక్రం తిప్పారట. జిల్లాలో బ్యాలెన్స్ కోసం నేదురుమల్లి రాజ్యలక్ష్మికి పదవి కట్టబెడుదామనుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆనం బ్రదర్స్ గట్టి షాక్ ఇచ్చారని అంటున్నారు. కాగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని ఆనం సోదరులు తమ వర్గానికి చెందిన భానుకు కట్టబెట్టించాలనే యోచనలో ఉన్నారట.












Click it and Unblock the Notifications