క్యాబినెట్ విస్తరణ: ఆశల పల్లకిలో రేణుకా చౌదరి, సర్వే

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి రేణుకా చౌదరిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రాధాన్యతను గుర్తించే ఆమెను ఎఐసిసి అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించి ఆమె సేవలను పార్టీకి వచ్చే ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన సర్వే సత్యనారాయణకు కూడా అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణకు చెందిన బలరాం నాయక్కు మంత్రి పదవి ఖాయం కావడంతో తెలంగాణ నుంచి మరొకరికి చోటు ఉండకపోవచ్చునని భావించారు. అయితే, సర్వే సత్యనారాయణకు పిలుపు రావడంతో మరో ఇద్దరిని రాష్ట్రం నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనే సందేహాలు కలుగుతున్నాయి. సర్వే సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సాంబశివరావు, తెలంగాణకు చెందిన వి హనుమంతరావు కూడా కేంద్ర మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో కొంత మంది పార్లమెంటు సభ్యులు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రాయపాటి సాంబశివ రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి లభిస్తుండడం పట్ల బలరాం నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. గిరిజనుల్లో పుట్టినందుకు తనకు ఈ అవకాశం లభిస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణకు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్యాయం చేయబోరని, 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన మేరకు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తుందనేది ఊహాగానాలు మాత్రమేనని రేణుకా చౌదరి శుక్రవారం మీడియాతో అన్నారు.












Click it and Unblock the Notifications