గొంతు మూగవోయింది, పాలగుమ్మి ఇక లేరు

దాదాపు 15 వేలకుపైగా పాటలకు సంగీతాన్ని సమకూర్చిన ప్రతిభాశాలి విశ్వనాథం. ప్రఖ్యాత రచయిత పాలగుమ్మి పద్మరాజుకు సోదరుడు. 1919లో తూర్పుగోదావరి జిల్లా తిరుపతిపురంలో జన్మించారు. రాయకుదురు, రాజమండ్రి ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. కాకినాడలో సంగీత భూషణ మర్లా సత్యనారాయణమూర్తి వద్ద కర్ణాటక గాత్ర సంగీతంలో, మహోపాధ్యాయ ఈమని శంకర శాస్త్రి వద్ద వీణా వాదనలోనూ శిక్షణ పొందారు. ఆ తర్వాత మద్రాస్ వెళ్లి సంగీత కళానిధి డాక్టర్ ఎస్.రామనాథం వద్ద శిష్యరికం చేశారు.
1954లో హైదరాబాదులోని ఆకాశవాణిలో చేరి వేలాది గేయాలకు సంగీతాన్ని సమకూర్చి శ్రోతలను ఆకట్టుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, సినారె, అబ్బూరి రామకృష్ణారావు, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ప్రముఖ కవుల గీతాలకు ఆయన స్వరరచన చేసి ప్రశంసలందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో లలిత కళల విభాగాన్ని ఆరంభించడంతో పాటు విద్యార్థులకు పాఠ్యాంశాల రూపకల్పన చేశారు.
బుల్లితెరపై 'రాజశేఖర చరిత్ర'కు 1991లో సంగీతాన్ని సమకూర్చి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి హంస అవార్డును పొందారు. 2005లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారాన్ని స్వీకరించారు. పాలగుమ్మి విశ్వనాథం భార్య సుమతి 2004లో కన్నుమూశారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు. పాలగుమ్మి మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications