ఎప్పుడో చెప్పాం, దెబ్బ తీసేందుకే..: తెలంగాణపై బాబు

చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బూడిదపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కలుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
తాము అధికారంలోకి వస్తే చదువుకున్నవారందరికీ ఉద్యోగం, ఉపాధి లభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమరవాయిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఆ హామీ ఇచ్చారు. అవినీతి పాలనను రూపుమాపితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బిసీలు, దళితులకు సామాజిక, రాజకీయ న్యాయం చేస్తామని చెప్పారు. అమరవాయిలో బాలకృష్ణ చంద్రబాబును కలిశారు.
శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 22వ తేదీన ప్రవేశించింది. అప్పటి నుంచి ప్రతి సందర్భంలోనూ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని పదే పదే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications