జగన్ 'రెడ్డి' ఎఫెక్ట్-చిరుతో భర్తీ: 'కాపు' కాస్తున్న కాంగ్రెస్
ఆ సామాజికవర్గం అండతో ఇన్నాళ్లూ రాష్ట్రంలో నెట్టుకు వచ్చిన కాంగ్రెసు ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. కాంగ్రెసు రెడ్ల పార్టీగా కూడా పేరుపడింది. అయితే ఇప్పుడు అదే పార్టీ 'కాపు'కాస్తోంది. రెడ్లు దూరం అవుతుండటంతో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలోనూ అది స్పష్టంగా కనిపించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి స్వతంత్ర హోదాతో పర్యాటక శాఖను కట్టబెట్టింది. పళ్లం రాజుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. దీంతో ఆ సామాజిక వర్గానికి పార్టీ ఇచ్చే ప్రాధాన్యత అర్థమవుతోంది.
టిడిపి కమ్మ, కాంగ్రెసు రెడ్ల పార్టీలుగా ముద్రపడ్డాయి. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కాపు సామాజికవర్గం తమకూ అధికారం వస్తుందని భావించింది. అప్పట్లో చిరంజీవి పార్టీయే గెలుస్తుందని అందరూ భావించారు. కానీ కేవలం 18 సీట్లతో పిఆర్పీ సరిపెట్టుకుంది. అయితే 70 లక్షల ఓట్లతో 16 శాతం ఓటింగ్ పిఆర్పీకి దక్కింది. దీంతో చిరంజీవి హవా, కాపు సత్తా అందరికీ తెలిసింది.
దీంతో కాంగ్రెసు పార్టీ కన్ను అప్పుడే కాపులపై పడింది. ఇందులో భాగంగా చిరంజీవిని కాంగ్రెసు వైపుకు రప్పించేందుకు అప్పుడు ప్రయత్నాలు జరిగినట్లుగా వార్తలు ఉన్న విషయం తెలిసిందే. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే చిరును కాంగ్రెసులోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశారట. కానీ ఆయన హఠాత్మరణం దానికి చెక్ పెట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరిగి చిరంజీవి కాంగ్రెసులో చేరిపోయారు.
ప్రధానంగా తమకు అండగా ఉన్న రెడ్లు జగన్ పెట్టిన పార్టీ వైపు వెళుతుండటంతోనే కాంగ్రెసు పునరాలోచించి చిరంజీవిని హక్కున చేర్చుకుంది. ఆయన అభిమానులతో పాటు ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా తమకే పడతాయని కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. కేవలం చిరంజీవితో మాత్రమే సరిపెట్టకుండా క్రమంగా పార్టీలో ఇక కాపులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. పల్లం రాజుకు ప్రమోషన్ అందులో భాగమేనని అంటున్నారు.
రాష్ట్రంలో నాలుగోవంతు నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం ఉంటుందట. అధికారం కోసం కాంగ్రెసు కాపులకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ సామాజికవర్గం హవా ఇక పార్టీలో ఉండబోతుందని అంటున్నారు. అదే సమయంలో రెడ్డిలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే విమర్శలు రాకుండా ఉండేందుకు కూడా కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.