కాంగ్రెసు వైఖరిపై కెసిఆర్ గుర్రు, తెలంగాణ పోరుకు రెడీ
ఉద్యమాన్ని ఉధృతం చేయడమే మార్గంగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పార్టీ నేతలను ఆయన ఇప్పటికే సమాయత్తం చేసినట్లు కూడా చెబుతున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఆయన దిగి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ నగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా తెరాసలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరింత మందిని పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా మరోసారి రాజకీయ కలకలం సృష్టించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెసు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కెసిఆర్ బుధవారం సాయంత్రం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత కె. కేశవరావుతో సమావేశమయ్యారు. ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. కాంగ్రెసు అధిష్టానంపై విశ్వాసంతో ఇంత కాలం ఎక్కువగా ఫామ్ హౌస్లో కాలం గడుపుతూ వచ్చిన ఆయన బయటకు వచ్చి కత్తులు నూరేందుకు సిద్ధపడుతున్నారు.
కరీంనగర్లో తెరాస విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి తెరాస సిద్ధమైంది. ఈ సమావేశం నవంబర్ ఐదు, ఆరు తేదీల్లో జరుగుతుంది. ఒక్క రోజు ముందే కెసిఆర్ కరీంనగర్ చేరుకుంటారు. కాంగ్రెసునే ప్రధానంగా లక్ష్యం చేసుకుని ఈసారి ఆయన ఉద్యమం సాగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని శాసనసభా నియోజకవర్గాలను కలుపుతూ కెసిఆర్ బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీనిపై కరీంనగర్ సమావేశంలో చర్చిస్తారు. రెండో విడత అన్ని మండల కేంద్రాలకు వెళ్లేలా కార్యక్రమం రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది.