జగన్ పార్టీలోకి దూకేవాళ్లకే ప్రాధాన్యం: సిఎంపై విహెచ్
చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ ఎప్పుడు చూసినా సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కనిపించేవాడని, తమ ప్రాంతాభివృద్ధికి ఆయన ఎంతో తపన పడుతున్నట్లు తాను భావించానని ఆయన అన్నారు. కానీ, జగన్ పార్టీలోకి వెళ్లేలోపు కాంగ్రెస్ ప్రభుత్వ సహాయంతో తన పనులన్నీ చక్కబెట్టుకునేందుకే అతను సీఎం చుట్టూ తిరిగాడని ఇప్పుడు తేలిందన్నారు. అలాగే, సీఎం ఇటీవల ఒక నియోజకవర్గానికి రూ.17 కోట్ల విలువైన పనుల్ని కేటాయించారని గుర్తు చేశారు. పార్టీ పట్ల విధేయత లేనివారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి ఈ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
ఎవరు కాంగ్రెస్కు విధేయులో, ఎవరు పార్టీ దూకాలని చూస్తున్నారో తెలియాలంటే విస్తృతస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరగాలని చెప్పారు. జిల్లా నాయకులు, ఎంపీల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే అన్ని విషయాలూ తెలుస్తాయని, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు మంత్రుల పిల్లలు జగన్ పార్టీలో చేరారని, ఇలాంటి విషయాలపై కూడా స్పష్టత తీసుకోవాల్సి ఉందన్నారు.
ఎన్నికలు వచ్చేవరకు స్తబ్దుగా కూర్చుంటే అప్పటికి గందరగోళం తలెత్తుతుందని, కాబట్టి ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికలకు నాయకులను తయారు చేసుకోవాలన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సీనియర్ లోక్సభ సభ్యుడు కావూరి సాంబశివరావుకు అన్యాయం జరిగిందని వీహెచ్ అన్నారు. ఆయన వందశాతం కాంగ్రెస్ మనిషని, కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ అభివృద్ధికి శ్రమించాడన్నారు.
అయితే, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించే అధికారం పార్టీ అధిష్ఠానానికి మాత్రమే ఉందని, ఈ నేపథ్యంలో అధిష్ఠానాన్ని ఎవరూ ప్రశ్నించలేమన్నారు. గతంలో జగన్ పార్టీ వైపు మొగ్గిన కిల్లి కృపారాణికి మంత్రి పదవి కట్టబెట్టిన సంగతిని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా కృపారాణి వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారని చెప్పారు.
జైపాల్రెడ్డి శాఖ మార్చిన వెంటనే అదే అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నాయకులు జైపాల్ రెడ్డిని ఆకాశానికెత్తేస్తున్నారని తెలిపారు. అంటే, కాంగ్రెస్ పార్టీలో నీతి, నిజాయితీలు గల నాయకులు ఉన్నారని వారంతా ఒప్పుకొంటున్నారని చెప్పారు.