తెలంగాణ: సోనియా గాంధీ ఆలోచన ఏమిటి?

Sonia Gandhi
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ పూర్తి కావడంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై దృష్టి సారిస్తారనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ఇవ్వడమా, ఇవ్వకుండా రాష్ట్రంలోని అత్యధిక లోకసభ స్థానాలపై కన్నేయడమా అనేది ఇప్పుడు సోనియా గాంధీ ముందున్న సమస్యగా చెబుతున్నారు. దీంతో తెలంగాణను ఎలా పరిష్కరించాలనే విషయంపై ఆమె ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే తెలంగాణ సాధ్యమని కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి వంటివారు చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే, నవంబర్ నెలలో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నుంచి గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ ఓ ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా అదే భావనతో ఉన్నారు. తెలంగాణకు అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరిస్తుందని కూడా ఆయన ఇప్పటికీ నమ్ముతున్నట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లను గెలుచుకుని ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే, కెసిఆర్‍తో పార్టీపరంగా చర్చలు జరిపిన కాంగ్రెసు అధిష్టానం ప్రభుత్వపరంగా జరగాల్సిన చర్చలను వాయిదా వేసింది. దీంతో కెసిఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. కెసిఆర్‌తో ప్రమేయం లేకుండా తెలంగాణ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉందా, అందువల్లనే కెసిఆర్‌ను మళ్లీ ఢిల్లీకి ఆహ్వానించలేదా అనే సంశయం కలుగుతోంది. ఎప్పటికప్పుడు సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు అడ్డుపడడుతుండడం వల్లనే తెలంగాణ నిర్ణయంలో జాప్యం జరుగుతోందని కాంగ్రెసు తెలంగాణకు చెందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటివారు అంటున్నారు.

మరోవైపు, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆలోచన మరో రకంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పది సీట్లనైనా గెలుచుకనే విధంగానే కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా లేదా తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువరించి ఎన్నికలకు దిగాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోయినా, ఏదో మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కట్టడి చేసి కేంద్ర మంత్రుల సీట్లను తప్పకుండా గెలుస్తామనే దీమాతో ఆయన ఉన్నట్లు చేస్తున్నారు.

అదే సమయంలో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చిరంజీవి ద్వారా ఆంధ్రప్రాంతంలోని కొన్ని లోకసబ సీట్లపై దృష్టి పెట్టవచ్చునని రాహుల్ గాంధీ నమ్ముతున్నట్లు చెబుతున్నారు. దీంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశం కూడా కాంగ్రెసు అధిష్టానంలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లక్ష్యం చేసుకోవడం వల్ల అటు సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, ఇటు తెలంగాణలో తెరాసకు తామే పోటీదారులమవుతామని కాంగ్రెసు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కాగా, సమైక్యవాదాన్ని, తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించిన పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కావూరి సాంబశివరావుకు మంత్రి పదవి దక్కాల్సి ఉండింది. అయితే, తెలంగాణవాదుల వ్యతిరేకత వస్తుందని, తెలంగాణ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని అంటున్నారు. మరోవైపు, తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడుతూ తమకు విధేయులుగా వ్యవహరిస్తున్న తెలంగాణలోని సర్వే సత్యనారాయణకు, బలరాం నాయక్‌కు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా తెలంగాణ అతివాదులకు హెచ్చరిక చేసినట్లయిందని అంటున్నారు.

మొత్తం మీద, రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ చెప్పినట్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలంగాణపై నిర్ణయం వెలువరించడానికి సోనియా గాంధీ సిద్ధపడవచ్చునని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. దానివల్ల తలెత్తిన చిన్నపాటి సమస్యలు పరిష్కారమై, మంత్రివర్గం కుదురుకున్న తర్వాత సోనియా గాంధీ తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+