నన్ను దీవించండి: చంద్రబాబు, మగ్గం నేసిన షర్మిల
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి ఊళ్ల మీద పడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోని సిండికేట్ నగర్లో షర్మిల మగ్గం నేశారు. వర్షాకాలంలోనూ రైతులకు సరిపడ విద్యుత్ సరఫరా చేయలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగించడం ఈ రాష్ట్ర రైతులు చేసుకున్న దురదృష్టమని నిట్టూర్చారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అధికారపార్టీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్లో పాదయాత్రను కొనసాగించారు. తాము అధికారంలోకి వస్తే రైతుల అప్పులన్నింటిని రద్దు చేస్తామని, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్ర పాలన కాంగ్రెసు పాలనలో అస్తవ్యస్తంగా మారిందని, తాను అధికారంలోకి వస్తే గాడిలో పెడతానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు తనను దీవించాలన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసు కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేశారని కానీ టిడిపి హయాంలో అర్హులకే మంజూరు చేశామన్నారు. కాంగ్రెసు హయాంలో అన్నింటి ధరలు బాగా పెరుగుతున్నాయన్నారు. తమ హయాంలో గ్యాస్ ధర ఒక్క రూపాయి కూడా పెరగలేదన్నారు.
తాను తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై ఎప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినా తమ వైఖరిని చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.