జగన్ పార్టీలోకి లక్ష్మీ పార్వతి: ఎన్టీఆర్ టిడిపికి రిజైన్!
ఆయన ఆశయాలను కొనసాగించేందుకే తాను ఈ పదహారు ఏళ్లు కష్టపడ్డానని చెప్పారు. తనను అమ్మ అని అన్నవాళ్లే తనపై ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తాను ఎన్టీఆర్ మరణం తర్వాత అనే పుస్తకాన్ని రాయబోతున్నట్లు చెప్పారు. తన ఆశయాలు కొనసాగే అనుకూలమైన వేదికగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తాను భావిస్తున్నానని లక్ష్మీ పార్వతి చెప్పారు.
అందుకే ఆ పార్టీలో చేరుతున్నానని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు.
కాగా ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలిగా లక్ష్మీ పార్వతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కొనేందుకే ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. చంద్రబాబుపై నిత్యం విమర్శలు చేస్తుంటారు. తాజాగా జగన్ హవా కొనసాగుతుండటంతో ఆమె ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.