నీలం కుదిపేస్తే పెళ్లి సంబరాల్లో నేతలు: బాబు ధ్వజం
పార్టీ నేత ఎర్రన్నాయుడు మృతి చెందడంతో ఆయన పాదయాత్ర రెండు రోజులు రద్దయింది. ఈ రోజు పెద్దచింతకుంట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసుపై మండిపడ్డారు. తుఫానుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కాంగ్రెసు నేతలు రెండు రోజుల క్రితం విజయనగరం జిల్లాలో జరిగిన పెళ్లిలో సంబరాలు చేసుకున్నారని, ఈ రోజు ఢిల్లీలో బలప్రదర్శనకు హాజరయ్యారని నిప్పులు చెరిగారు.
నీలం తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటను నష్టపోయారన్నారు. తుఫాను హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర పరిస్థితిపై అవగాహన లేదని, ఆయన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పంటలు అన్నీ దెబ్బతిన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని చంద్రబాబు అన్నారు.
ప్రభుత్వానికి విజయనగరంలో పెళ్లి, ఢిల్లీలో బల ప్రదర్శన ముఖ్యమా లేక ప్రజలు ముఖ్యమా చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. కాగా అంతకుముందు ఆయన ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాగా చంద్రబాబు రేపు తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.