జగన్ కేసు: మళ్లీ ఈడి ముందుకు విజయ సాయి రెడ్డి
ఈ రోజు ఈడి అప్పిలేట్ అథారిటీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జగన్తో పాటు ఎమ్మార్ సంస్థకు కూడా ఈడి అప్పిలేట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. కాగా సోమవారం విజయ సాయి రెడ్డి ఈడి అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డిని ఈడి అధికారులు అరగంట పాటు విచారించారు. ఈడి అధికారులు తనను విచారించడం పూర్తయిందని, తాను హైదరాబాద్ వెళ్లిపోతున్నానని విజయసాయి రెడ్డి విచారణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించలేదు. వైయస్ జగన్ కేసులో మరో విడత ఆస్తులు జప్తు చేయడానికి ఈడి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయ సాయిరెడ్డిని విచారించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈడి ఇప్పటికే 52 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది.
మరో విడత జప్తునకు సిద్ధమవుతూ విజయ సాయి రెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని విజయసాయి రెడ్డి తమ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో ఈడి అధికారులు ధ్రువీకరించుకున్నట్లు చెబుతున్నారు. మరో పది, పదిహేను రోజుల్లో రెండో విడత జప్తు ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది.