ఎన్నికల్లో పొత్తులుండవు, కాంగ్రెసు డేంజర్: కెసిఆర్

కరీంనగర్లో ప్రారంభమైన పార్టీ మేధోమథన సదస్సులో ఆయన పార్టీ నేతలతో ఆయన బుధవారం మాట్లాడారు. కాంగ్రెసును నమ్మొద్దని, అది చాలా డేంజర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పడం వల్లనే తాను చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని, చర్చలకు బ్రేకులు వేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. సమావేశం వివరాలు బయటకు వెళ్లకుండా కెసిఆర్ మీడియా ప్రతినిధుల సెల్ఫోన్లను స్విచాఫ్ చేయించారు.
తెలంగాణ జెఎసిని తామే ఏర్పాటు చేశామని, జెఎసి చైర్మన్కా కోదండరామ్ను నియమించింది తానేనని, అటువంటి జెఎసి తాము ఎలా వదులుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసితో విభేదాలు చిన్నవేనని, ఆ సమస్యలు సమసిపోతాయని ఆయన అన్నారు. తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత కోదండరామ్తోనూ జెఎసి నేతలతోనూ మాట్లాడుతానని ఆయన చెప్పారు.
మహబూబ్నగర్, పరకాల స్థానాల్లో జెఎసి నిర్వాకాన్ని ఎలా మరిచిపోతామని ఆయన అడిగారు. అందువల్లనే తాను కావాలనే జెఎసి నేతలను, కోదండరామ్ను దూరం పెట్టానని చెప్పారు. పార్లమెంటు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. అలాగే, 29వ తేదీన దీక్షా దివస్ నిర్వహించనున్నారు. ఇది తెలంగాణవ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో జరుగుతుంది. నవంబర్ 30వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కెసిఆర్ తెలిపారు.
కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తామని వచ్చిన వార్తలు గందరగోళం సృష్టించాయని, కోదండరామ్తో విభేదాలపై కూడా ఏమీ చెప్పలేకపోతున్నామని పార్టీ నాయకులు అడిగారు. ఈ రెండు అంశాలపై స్పష్టత ఇవ్వాలని నాయకులు ఆయన కోరారు.
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంతోష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై కెసిఆర్ బుధవారం ఉదయం స్పందించారు. బలిదానాలు వద్దని, బలమైన ఉద్యమ కార్యాచరణతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుందామని కెసిఆర్ అన్నారు. ఎవరూ ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకారమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications