బెడిసి కొట్టిన కిరణ్ వ్యూహం: ఢిల్లీలో మర్రి, డిఎస్ మకాం
రాష్ట్ర నాయకత్వాల మార్పునకు సంబంధించి కొత్త కాంబినేషన్లను తెరపైకి తీసుకువచ్చాయి. తెలంగాణకు చెందిన డి.శ్రీనివాస్కు సిఎం బాధ్యతలు అప్పగిస్తే కోస్తాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేస్తారని, జానా రెడ్డి లేదా మర్రి శశిధర్ రెడ్డికి సిఎం పదవి ఇస్తే కన్నా లక్ష్మీ నారాయణకు పిసిసి చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. మరోవైపు సిఎం వర్గీయ తెలంగాణ ఎమ్మెల్యేలు కెఎల్ఆర్ నేతృత్వంలో అధిష్ఠానం పెద్దలను కలవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
సిఎల్పీ ఆమోదం మేరకు రోశయ్య స్థానంలో కిరణ్కు అధిష్ఠానం సిఎం బాధ్యతలను అప్పగించలేదన్న విషయం గుర్తుంచుకోవాలని పార్టీలో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయట. ఇప్పుడు సిఎంగా కిరణ్ను కొనసాగించాలని మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్ఠానం వద్ద మొత్తుకున్నా లేదంటే ఆయనను తొలగించాలంటూ అత్యధికులు డిమాండ్ చేసినా ఫలితం లేదన్నారు. అధిష్ఠానం ఆలోచనే అంతిమమని తెలిసి కూడా కెఎల్ఆర్ బృందాన్ని ఢిల్లీ పెద్దల వద్దకు పంపి కిరణ్ తప్పు చేశారని అంటున్నారు.
ముఖ్యమంత్రి ముఠాలను ప్రోత్సహిస్తున్నారని ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడేలా ఈ చర్యలున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకూ సీఎంకు మద్దతుగా ఢిల్లీ పెద్దల వద్ద చెప్పేవారే లేరని.. ఇలాంటి సమయంలో కేఎల్ఆర్ బృందం ఆయనను సమర్థిస్తూ కొంతమందైనా చెప్పడం మంచిదేనని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ వరకే కెఎల్ఆర్ బృందం పరిమితమైతే అభ్యంతరం ఉండేది కాదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
సిఎంను మార్చొద్దంటూ కిరణ్ చేపట్టిన అభివృద్ధి పథకాలను వల్లె వేయడమే తెరవెనుక వ్యూహాన్ని బయట పెట్టిందని అంటున్నారు. దీనివల్ల కిరణ్కు ప్రయోజనం కంటే నష్టమే కలిగించిందని అంటున్నారు. అలాగే సిఎం మార్పుపై సోనియా గాంధీతో తాను చర్చించలేదన్న వయలార్ రవి చేసిన వ్యాఖ్యలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలనకే పరిమితమయ్యే వయలార్ అకస్మాత్తుగా మీడియా ముందుకొచ్చి సిఎం మార్పు ఉండదని చెప్పడాన్ని కొందరు తేలిగ్గా తీసుకుంటే, మరికొందరు దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నందున దీనిపై స్పష్టతను ఇవ్వాల్సింది వారేనని సీనియర్ల అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి మార్పు ప్రచారం నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డి, డి శ్రీనివాస్లు ఢిల్లీలోనే ఉండటాన్ని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. ఏదో జరుగుతోందని లేకుంటే సిఎం రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేతలు ఢిల్లీలో మాకం వేయడం దేనికి సంకేతం అంటున్నారు.