తెలంగాణ సెగ: వ్యతిరేకంగా మాట్లాడనని బాబు హామీ
తెలంగాణవాదులు రాళ్లు రువ్వారు. దీంతో పలువురుకి స్వల్ప గాయాలయ్యాయి. ఓ జర్నలిస్టుకు కూడా గాయాలయ్యాయి. ఆందోళకారులు చంద్రబాబు నాయుడుకు, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలిపిన వారిలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపటికి పోలీసులు వారిని అక్కడి నుండి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఇది జరిగింది.
అయితే ఆందోళనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలకు వారిని ఏమీ అనవద్దని హితవు పలికారు. వారు కాసేపు ఆందోళన చేసుకొని, వ్యతిరేకంగా నినాదాలు చేసి అక్కడి నుండి వెళ్లి పోతారని, వారిని టచ్ చేయవద్దని, వారిని ఏమీ అనవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలిపితే చాలన్నారు. ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని చెప్పారు.
తాను గానీ, తెలుగుదేశం పార్టీ గానీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, భవిష్యత్తులో తాను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడనని చంద్రబాబు చెప్పారు. ఆత్మహత్యలపై స్పందిస్తూ... విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఎవరు కూడా భావోద్రేకానికి గురై ఆత్మబలిదానాలు చేసుకోవద్దని సూచించారు. ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చవద్దని అన్నారు.
తాము అఖిలపక్ష సమావేశం పెడితే తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టంగా తెలియజేస్తామన్నారు. పరిపాలనపై అనుభవం లేనివారు హామీలు గుప్పిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. నీతివంతమైన పాలన కేవలం టిడిపికే సాధ్యమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయానికి కనీసం మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శించారు.
అవినీతిలో కాంగ్రెసు పార్టీతో భారతీయ జనతా పార్టీ పోటీ పడుతోందన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మనీ ల్యాండరింగ్కు పాల్పడటమే మంచి నిదర్శనం అన్నారు. కాంగ్రెసుకు గంట పాటైనా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెసుకు సంఘ బహిష్కరణ చేయాలన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎం కాదని కిరి కిరి రెడ్డి అని ఎద్దేవా చేశారు. తప్పు చేయకుంటే జగన్ జైలుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో వాటా ఉండటం వల్లనే సోనియా గాంధీ వైయస్ అవినీతికి అడ్డుకట్ట వేయలేక పోయారన్నారు.