ఉస్మానియాలో మళ్లీ ఉద్రిక్తత: సంతోష్ అంతియమాత్ర
సంతోష్ అంతిమయాత్రకు తొలుత నిరాకరించిన పోలీసులు చివరకు సికింద్రాబాదులోని అమర వీరుల స్థూపం వరకు అనుమతించారు. అయితే, ఒయు పోలీసు స్టేషన్ వద్ద అంతిమ యాత్రను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టియర్ గ్యాస్ షెల్స్ తగిలి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట గల చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో విద్యార్థులు, తెలంగాణవాదులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సంతోష్ ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సంతోష్ సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని సంతోష్ భౌతికాయాన్ని అక్కడ నుండి తరలించే ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు వారి చర్యలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.