'కామన్' వ్యూ: వైఎస్ మంచి ఓ వైపే, బాబుది మరోవైపు
"నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసినా...నేడు చంద్రబాబు చేస్తున్నా..... పాదయాత్రలు పదవుల కోసమే. రాజకీయాలు కలుషితమై చాలా కాలం అయింది. తన పాదయాత్రలతో ప్రజలను ఫిదా చేసి సీఎం అయిన రాజశేఖర్ రెడ్డి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వైఎస్ మంచి తనం నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు అవినీతితో తన విశ్వరూపం చూపించాడు. వైఎస్ అవినీతి గురించి రాష్ట్రంలోని జనాలందరికీ తెలుసు. కాక పోతే ఆయన వల్ల లబ్ది పొందిన వారు ఆయన అవినీతిని ఒప్పుకోవడానికి ఇష్ట పడరు.
వైఎస్ వారసుడిగా జగన్ రాజకీయ పార్టీ పెట్టింది ఆస్తులను కాపాడు కోవడానికి, తండ్రి అవినీతిని కప్పిపుచ్చడానికే. జగన్ సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుంది నిజమే..కానీ అవినీతి కూడా పెరిగి పోతుంది. అన్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల కొన్నేళ్ల వరకు బాగానే ఉంటుంది. భవిష్యత్ తరాలకు ఇబ్బంది తప్పదు. అన్నీ ఫ్రీగా ఇవ్వడానికి అప్పులు చేస్తారు, ప్రభుత్వ భూములు అమ్ముతారు. ఇలా ఎంత కాలం ఇస్తారు?
చంద్రబాబు హయాంలో రైతులుకు మంచి జరుగలేదు నిజమే కానీ....ఆయన హయాంలో చేసిన కొన్ని పనులు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. అప్పుడు వైఎస్ ప్రభుత్వంలో ఉన్నంత అవినీతి లేదు. మన జనాలకు ఈ రోజు లాభం జరిగిందా, లేదా అనేదే ముఖ్యం...భవిష్యత్ గురించి ఎవరూ ఆలోచించరు. ఫ్రీగా ఇచ్చి పన్నులు, రేట్లు పెంచితేనే మనోళ్లకు హాయిగా ఉంటుంది...ముందు జనం మారాలి.
కేసీఆర్ పార్టీ తెరాస, బీజేపీ పార్టీలు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి కానీ....వారికి తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు. రాజకీయ ఆధిపత్యం, పదవుల కోసం వారి ఆరాటం. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పాలన ఎంత త్వరగా పోతే అంత మంచింది. అభ్యుదయ భావాలు ఉన్న లోక్ సత్తా లాంటి పార్టీలు అధికారంలోకి వస్తే కాస్త మంచి జరుగుతుంది. అంతకంటే ముందు జనాల్లో మార్పురావాలి".