ఫెమా ఉల్లంఘన కేసు: పార్థసారథికి హైకోర్టులో ఉరట
అంతకుముందు నెల రోజుల క్రితం కూడా ఢిల్లీలోని ఫెమా ట్రిబ్యునల్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఫెమా ఉల్లంఘనకు సంబంధించి పార్థసారథికి ట్రిబ్యునల్ రూ.3 లక్షల జరిమానా విధించింది. ఈ ఆదేశాలను నిలుపుదల జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఈ రోజు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తమ ఆదేశాలు అమలులో ఉంటాయని కోర్టు తెలిపింది.
కాగా ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారనే కేసులో మంత్రి పార్థసారథికి గతంలో కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని కోర్టు పార్థసారథికి జారీ చేసిన సమన్లలో ఆదేశించింది. పార్థసారథిపై ఐపిసి 177, 171జి, 125ఏ, 33ఏ, 195 సిఆర్పి సెక్షన్ల క్రింద కేసు నమోదయింది. ఎన్నికల కమిషన్ పార్థసారథి కేసు విషయాన్ని పేర్కొనక పోవడంపై చర్యలు ప్రారంభించింది.
మంత్రి పార్థసారథి ఎన్నికల కమిషన్ వద్ద తన పైన కేసు ఉన్న విషయాన్ని దాచిపెట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్కు సమర్పించిన తన అఫిడవిట్లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.