'శంకర్దాదా' తరహా హైటెక్ కాపీయింగ్: తెలుగు వారూ
ఏడుగురు మహిళా వైద్యులతో సహా మొత్తం 17 మందిని సిబిఐ అరెస్టు చేసింది. వీరిలో ముగ్గురు వైద్యులు ఆంధ్ర ప్రదేశ్కి చెందిన వారని సమాచారం. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏడు వేలమంది హాజరవుతున్నారు. సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం అధికారులు ఈ పరీక్షలు జరుగుతున్న కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. నాలుగు కేంద్రాల్లో హైటెక్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్థినులు వారికి చిక్కారు.
అత్యాధునిక లాప్టాప్లు, మైక్రోఫోన్లు, సూక్ష్మ కెమెరాలు, ఫోన్లు, బ్లూటూత్, వైర్లెస్ ఇయర్ ప్లగ్లు వంటి పరికరాలను ఉపయోగించి ఈ ముఠా కాపీయింగ్కు పాల్పడుతోంది. ఎవరికీ కనపడకుండా దుస్తులకు పెట్టుకున్న కెమెరాలు, ఫోన్లతో వీరు ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి, బయటకు పంపేవారు. ఈ ప్రశ్నపత్రాన్ని బయట ఉన్న ఏడుగురు వ్యక్తులు తీసుకొని, హైదరాబాద్, పాట్నాల్లో ఉన్న నిపుణులకు పంపేవారు.
నిపుణులు పంపిన సమాధానాలను విద్యార్థులకు బ్లూటూత్, వైర్లెస్ ఇయర్ ఫోన్ల ద్వారా అందించేవారని సిబిఐ ఓ ప్రకటనలో తెలిపింది. కాపీయింగ్ కోసం విద్యార్థులు అత్యాధునిక పరికరాలను అమర్చుకొనే విధంగా ప్రత్యేక దుస్తులను ధరించారని సిబిఐ వెల్లడించింది. ఈ దుస్తుల్లో బటన్ కెమెరాలు, ఫోన్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలు ఎవరికీ కనపడకుండా ఇమిడిపోతాయి. దీంతో ఎవరికీ అనుమానం కలగదు. ఏడుగురు విద్యార్థినులతో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసినట్లు సిబిఐ వెల్లడించింది.