దీపావళి వేడుకలకు కిరణ్ రెడ్డి, చంద్రబాబు దూరం
నీలం తుఫాను వల్ల రైతులతో పాటు ఇతర వర్గాల వారు తీవ్రంగా నష్టపోయినందున వారికి సంఘీభావంగా దీపావళి జరుపుకోకూడదని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు ఆయన కార్యాలయం అధికారులు తెలిపారు. దాంతో దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు ఎవరూ రావద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
దీపావళి వేడుకలకు నిర్వహించుకోకూడదని నిర్ణయించుకున్నందున శుభాకాంక్షలు తెలపడానికి చంద్రబాబు వద్దకు ఎవరూ రావద్దని తెలుగుదేశం పార్టీ నాయకుడు గరికపాటి రామ్మోహన్ రావు సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రజలకు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.