ఆత్మహత్యకు అనుమతివ్వండి: రైతు దంపతుల మొర

వివరాలు ఇలా ఉన్నాయి - గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వజ్జా రాఘవయ్య 1950 ప్రాంతాల్లో విశాఖ జిల్లాకు వలస వచ్చారు. 1952లో పాయకరావుపేట మండలం కేశవరం శ్రీరాంపురంలో 600 ఎకరాలను తంగేడు రాజుల నుంచి కొనుగోలు చేశారు. బాపట్లకు చెందిన రాఘవయ్య స్నేహితుడు రత్తయ్య కూడా 600 ఎకరాలను కొనుగోలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ భూముల్లో సరుగుడు తోటలువేసి, కలపను రాజమండ్రి పేపరు మిల్లుకు సరఫరా చేసేవారు. కొంతకాలం తరువాత రత్తయ్య భూమిని అమ్మేసి సొంత జిల్లాకు వెళ్లిపోయారు. రాఘవయ్య మాత్రం సాగుచేసుకుంటున్నారు.
ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు మానసిక వికలాంగుడు. ఒక కుమార్తె నిర్మల భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దనే వుంటున్నది. మరో కూతురు హైదరాబాద్లో ఉంటున్నది. ఈ నేపథ్యంలో 1990 దశకంలో రాఘవయ్య సాగుచేసుకుంటున్న భూమి బంజరు భూమంటూ స్థానికులు ఆక్రమణకు దిగారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అప్పట్లో సబ్కలెక్టర్గా పనిచేస్తున్న శాంతకుమారి మధ్యవర్తిత్వం నెరిపి, కేసును ఉపసంహరించుకుంటే 50 ఎకరాల భూమిని ఇస్తానని రాఘవయ్యకు చెప్పారు. స్థానికంగా బలం లేకపోవడంతో ఆయన అంగీకరించి కేసును ఉపసంహరించుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు 35 ఎకరాలు మాత్ర మే ఇచ్చి పాసుపుస్తకాల్లో డి.పట్టాగా పేర్కొన్నారు. తాను మోసపోయినట్టు రాఘవయ్య గుర్తించారు. అయినా 35 ఎకరాల్లోనే జీడి మామిడి తోటలు వేసుకుని జీవ నం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ 35 ఎకరాలను కూడా లాక్కోవడానికి స్థానికులంతా ఏకమయ్యారు. జీడిమామిడి తోటల్లో ఫలసాయాన్ని బలవంతంగా తీసుకుపోతున్నారు. ఇదేమిటని అడిగితే చంపి, ఇసుకలో పాతేస్తామని బెదిరించారు. దీంట్లో 12 ఎకరాలకు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని రాఘవయ్య వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు గ్రామస్థులకు అండగా నిలిచి, తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత్యంతరం లేక చనిపోవాలని అనుమతించండంటూ కోరుతున్నామన్నారు. దీంతో మంత్రి స్పందిస్తూ, ఈ వ్యవహారంలో మీకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications