తెరపైకి 150వసినిమా: చిరంజీవి జోష్, అధిష్టానం హామీ
చిరుకు కేంద్రమంత్రి పదవి రావడం అదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో ఆయన వర్గానికి ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం హామీ ఇవ్వడంతోనే ఆయనలో జోష్ కనిపిస్తోందంటున్నారు. 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితర పార్టీ నేతలు ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ చిరంజీవికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఇప్పటికే హామీ వచ్చిందంటున్నారు. పార్టీలో చిరంజీవికి క్రమంగా మద్దతు కూడా పెరుగుతోంది.
చిరులో క్రమంగా జోష్ కనిపిస్తుండగా కిరణ్ వైఖరి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కిరణ్ పట్ల మొదట అసంతృప్తితో ఉన్న అధిష్టానం తెలంగాణ కవాతు తర్వాత కొంత మెతక వైఖరిని అవలంభించింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపుకు వెళ్లడం, మజ్లిస్ పార్టీ మద్దతు ఉపసంహరించడం, పలువురు కిరణ్ను వ్యతిరేకించే పార్టీ నేతలు ఫిర్యాదులు చేయడం నేపథ్యంలో మళ్లీ కిరణ్ పరిపాలన పైన అధిష్టానం పట్ల అసంతృప్తి కనిపిస్తోంది.
అందుకే ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయంటున్నారు. కిరణ్ తీరు గమనిస్తుంటే ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. అధిష్టానం ఆయన పాలన పట్ల అసంతృప్తి ప్రదర్శించిన మొదట్లో తన పాల్గొన్న బహిరంగ సభల్లో పదవులు శాశ్వతం కాదంటూ నిరాశ ప్రకటించే వారని, తెలంగాణ కవాతు తర్వాత కిరణ్లో నూతనోత్సాహం కనిపించిందని, అయితే సిఎం మార్పు ఊహాగానాల నేపథ్యంలో మరోమారు ఆయనలో ఇటీవల ఉత్సాహం కనిపించడం లేదని అంటున్నారు.
వారం రోజుల క్రితం నీలం తుఫాను ప్రభావిత జిల్లాల ఏరియల్ సర్వే కోసం వెళ్లిన కిరణ్ హఠాత్తుగా తన పర్యటనను మూడు జిల్లాలకు బదులు రెండు జిల్లాలోనే ముగించుకొని వచ్చారు. ఈ రోజు(బుధవారం) బాలల దినోత్సవం సందర్భంగా ఆయన పదవులు శాశ్వతం కాదంటూ మరోసారి వేదాంతం వల్లించారని చెబుతున్నారు.