తెలంగాణ ఇష్యూ: బాబును కార్నర్ చేస్తున్న జగన్!
తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని, తాము ఇచ్చే పరిస్థితుల్లో తెచ్చే పరిస్థితుల్లో లేమని, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. టిడిపి వ్యతిరేకం కాదని చెప్పినా, వైయస్సార్ కాంగ్రెసు కేంద్రం నిర్ణయానికి కట్టుబడతామని చెప్పినా ఆ పార్టీల అభిప్రాయాల్లో పెద్దగా తేడా లేదనే చెప్పవచ్చు. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన ప్రకటనతో మాత్రం టిడిపి కంటే జగన్ పార్టీ ఓ అడుగు ముందుందని చెబుతున్నారు.
గత ఆదివారం వైయస్ విజయమ్మ నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఆమె సమక్షంలో జిల్లాకు చెందిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ... జగన్ బయట ఉంటే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ఓదార్చే వారని చెప్పారు. విజయమ్మ ఈ ప్రకటన ద్వారా తాము తెలంగాణకు వ్యతిరేకంగా కాదనే భావనను తెలంగాణ ప్రజల్లో మరింత ఎక్కువగా జొప్పించారు.
కేవలం తాము వ్యతిరేకం కాదని, కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే ప్రకటన కంటే జగన్ ఓదార్చే వారని చెప్పడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చిందని తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. అయితే దీనిని మరికొందరు ఖండిస్తున్నారు. జగన్ ఓదార్పు రాజకీయాలు అందరికీ తెలిసినవేనని, వైయస్ మృతిని తట్టుకోలేక చనిపోయారంటూ కొందరిని ఆయన జైలుకెళ్లే ముందు వరకూ ఓదార్చారని, తెలంగాణ అమరవీరులకు ఓదార్పు అని విజయమ్మ అనడం కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తప్ప నిజంగా అమరవీరుల కోసం కాదని అంటున్నారు.