నరబలికి యత్నం: గుప్త నిధుల వేటలో క్షుద్రపూజలు
టీవీ చానెళ్ల కథనాల ప్రకారం - ఎర్రబాలెం సమీపంలోని ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలాజీ, భాస్కర్ అనే ఇద్దరు విద్యార్థులను నరేంద్ర మాయమాటలు చెప్పి నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసి, మంగళగిరిలో నిర్బంధించాడు. వారిని గత నాలుగు రోజులుగా రాత్రి పూట ఇద్దరు పిల్లలను ఎర్రబాలెం కొండపైకి తీసుకెళ్లి క్షుద్రపూజల చేయించి, మళ్లీ తీసుకుని వచ్చి నిర్బంధించసాగాడు. చివరకు సోమవారం ఆఖరు క్షుద్ర పూజ చేసి ఆ ఇద్దరు పిల్లలను బలి ఇవ్వాల్సి ఉండింది.
కొండపై అలికిడి కనిపించడంతో స్థానికులు అప్రమత్తమై ఏం జరుగుతోందో చూద్దామని కొండపైకి వెళ్లారు. వారిని చూసిని మాంత్రికుడు, మరో ముగ్గురు పారిపోయారు. నరేంద్రతో పాటు మరో ఇద్దరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. మరో నలుగురిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
ఏర్రబాలెం కొండపై గుప్తనిధులు ఉన్నాయని భావించి, కొంత మంది రహస్యంగా తవ్వకాలు సాగించారు. నరబలి ఇస్తే గుప్త నిధులు బయట పడుతాయని చెప్పడంతో మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించారు. నరబలికి కూడా సిద్ధపడ్డారు. నరేంద్ర తెనాలి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. తమ పట్ల నరేంద్ర, ఇతరులు వ్యవహరించిన తీరును, పూజల విషయాన్ని పిల్లలు మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.