బాబు 'మనసులో మాట' బుక్: పాలనపై షర్మిల ఎద్దేవా
మాట ఇవ్వడం, దానిని నిలబెట్టుకోవడం అంటే ఈ జన్మలో చంద్రబాబుకు అర్థం కాదన్నారు. బాబు ఓ పుస్తకం రాస్తున్నారని, అది మనసులో మాట అని, అందులో ప్రాజెక్టులు నష్టమని, వ్యవసాయం దండుగ అని, ఉచిత పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని... ఇలా చంద్రబాబు ఆ పుస్తకంలో రాసుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసమే పాదయాత్ర అంటూ బాబు మభ్యపెడుతున్నారన్నారు.
ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు తమకు మెజార్టీ లేనందున తాను పాదయాత్ర చేయడంలో అర్థముందని, కానీ అవిశ్వాసం పెట్టేందుకు అవసరమైన బలమున్న బాబు పాదయాత్ర చేయాల్సిన అవసరమేముందన్నారు. పాదయాత్రలో బాబుకు ప్రజలు ఈ ప్రభుత్వంపై విశ్వాసం లేదని చెబుతున్నా, ఆయన మాత్రం అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు. కిరణ్ ప్రభుత్వానికి ఆయన అండగా నిలుస్తూ... పాదయాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు.
చంద్రబాబు నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు తనకే తెలివి ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని, తనకే పరిపాలనా దక్షత ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని, మాకు లేనట్లుగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అని చెప్పి బెల్టు షాపులు పెట్టించడం, వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడటం ఎమ్మెల్యేల్ని బంధించి, బెదిరించి లొంగ తీసుకోవడం.. పరిపాలనా దక్షతకు నిదర్శనమా అని ప్రశ్నించారు.
వైస్రాయ్ రాజకీయాలతో సొంత మామకు వెన్నుపోటు పొడిచారన్నారు. బాబు పాదయాత్ర చేస్తూ చెబుతున్న మాటలను సొంత ఎమ్మెల్యేలు నమ్మక పోవడం వల్లనే తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను తాము కొనుక్కోవడం లేదన్నారు. చంద్రబాబులాగా తమకు ప్రజాప్రతినిధులను కొనుక్కోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేల మనస్సాక్షి ప్రకారమే వారు తమ వద్దకు వస్తున్నారన్నారు.
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాఫియా డాన్ అని ధ్వజమెత్తారు. బినామీల పేరుతో మద్యం దుకాణాలు నడుపుతున్న ఆయనకు ఇతరుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించక పోవడం దారుణమన్నారు.