జగన్‌కు ఎదురు తిరిగిందా: కెసిఆర్ కూడా తెర లేపారా?

YS Jagan-K Chandrasekhar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 'జంపింగ్' వ్యూహం ఎదురు తిరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ స్థాపించిన కొద్ది కాలం నుండి కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ వస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వెళతారంటూ వారు చేరక ముందే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరిగేది. నేరుగా ఇతర పార్టీ నేతలు చేరడం కాకుండా ఇలా కొద్దికాలం ప్రచారం జరిపి చేర్పించుకుంటే లబ్ధి చేకూరుతుందనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు.

ఇంతకాలం జగన్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చారని చెబుతున్నారు. ఇటీవల వ్యూహాన్ని కాస్త మార్చారని అంటున్నారు. పార్టీలో చేరే వారే కాకుండా ఆయా పార్టీలను వదులుకోవడానికి సిద్ధపడని వారిని, తమతో చర్చలు జరిపి పార్టీలోకి వచ్చేందుకు ఇష్టపడని వారిపై కూడా ప్రచారం ప్రారంభించినట్లుగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయా పార్టీల పట్ల చిత్తశుద్ధితో ఉన్న నేతలపై కూడా ప్రచారం చేస్తే పార్టీ పని అయిపోయిందని కొంతలో కొంతైనా ప్రజలు ఓ అభిప్రాయానికి రాక తప్పదు.

అలాంటి అభిప్రాయాన్ని కలిగించేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చేందుకు ఇష్టపడని నేతల పైనా, చర్చలు జరపని నేతల పైనా కూడా ప్రచారం చేస్తూ ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఇంతకాలం అలాంటి ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసుకు రాజకీయంగా లబ్ధి చేకూరినప్పటికీ ఈ రోజుతో ఎదురు తిరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రచారం జరిగినప్పటికీ కొందరు వచ్చారు.. మరికొందరు వెనక్కి వెళ్లారు.

కానీ చర్చలు జరపడం, కొంతకాలం జగన్ వైపు ఉండటం లేదా జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం తదితరాల కారణంగా వారిపై ప్రచారం జరిగేదని, దానిని పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి సైలెంట్‌గా వెళ్లిన వారు లేరని అంటున్నారు. నేరుగా చేరకుండా పార్టీపై విమర్శలు చేస్తూ... కొద్దికాలం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టి వెళ్లారు... వెళ్లారని గుర్తు చేస్తున్నారు.

అయితే ఇటీవల మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మైండ్ గేమ్ ఆడుతూ ఇతర పార్టీలను బలహీనపర్చాలని చూస్తోందని పయ్యావుల కేశవ్ ఈ రోజు ధ్వజమెత్తారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జగన్ మైండ్ గేమ్ వల్ల ఇప్పటికి లబ్ధి చేకూరినా భవిష్యత్తులో నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. పయ్యావుల కేశవ్ వంటి నేతలు కూడా తమ పార్టీలోకి వస్తారని ప్రచారం చేయడం వల్ల ఆ పార్టీవి గ్లోబెల్ ప్రచారాలు అని ప్రజలు ఈ రోజుకి అర్థం చేసుకున్నారని చెబుతున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఎనుగుల రవీందర్ రెడ్డి, కాంగ్రెసు ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పైన కూడా ఇలాంటి ఉత్తుత్తి ప్రచారమే చేశారని అంటున్నారు. ఇన్నాళ్లూ ఇతర నేతలు ఇలాంటి ప్రచారాన్ని కొట్టి వేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ. పైగా వెళ్దామనుకునే వారు వాటిని సమర్థించినట్లుగా మాట్లాడే వారు. కానీ ఈ రోజు పయ్యావుల, ఏనుగుల, ఆకులలు ధాటిగా స్పందించారు. తాము చేరతామని ఎవరు చెప్పారని ఘాటుగా ప్రశ్నించారు.

ఇలాంటి ఘాటైన ఎదురుదాడి ఇంతకుముందు రాలేదని అందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పినవే నిజాలు అని నమ్మే పరిస్థితి కనిపించిందని, కానీ ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభం కావడంతో అన్నీ నిజాలు కావనే విషయం అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా జగన్‌కు, ఆయన పార్టీకి ఎదురుదెబ్బే అంటున్నారు. ఇలాంటి మైండ్ గేమ్‌కు కెసిఆర్ కూడా తెర లేపారని అంటున్నారు.

ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నారని మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్, మానకొండూరు ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌లు తెరాసలో చేరనున్నారనే ప్రచారం కాంగ్రెసులోనూ కలకలం రేపింది. అయితే ఈ ప్రచారాన్ని వారు కొట్టి పారేశారు. అయితే జగన్ తరహా మైండ్ గేమ్‌కు కెసిఆర్ తెర తీశారని, అందుకే ఇలాంటి ప్రచారం జరిగి ఉండవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+