అసద్ టచ్: జగన్ పార్టీ వైపు ముఖేష్, ఎమ్మెల్యేలు
హైదరాబాద్కు చెందిన రాష్ట్ర మంత్రి ముఖేశ్ గౌడ్ కూడా వలసబాట పట్టనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై గత కొంత కాలంగా ముఖేశ్ అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొందరు ముఖేశ్తో సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాను సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తానంటూ ఈ ఏడాది మార్చిలో ముఖేశ్ బహిరంగంగా ప్రకటించడం వివాదాస్పదమైంది.
సికింద్రాబాద్ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ దీనిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ సమయంలో సికింద్రాబాద్ అంజన్ జాగీరా అంటూ ముఖేశ్ ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ కోసం ముఖేష్ వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ముఖేష్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు చేరితే సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలన్నది ముఖేష్ ఆలోచనగా చెబుతున్నారు. గోషా మహల్ శాసనసభా నియోజకవర్గం నుంచి తన కుమారుడిని బరిలోకి దించే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్లు చెబుతున్నారు.
అదే సమయంలో నగరానికి చెందిన శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, స్వతంత్య్ర శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వారు తమ అనుచరులతో మంతనాలు కూడా జరుపుతున్నారని అంటున్నారు. వీరితో పాటు నగరానికి చెందిన బీసీ వర్గానికి చెందిన మరో శాసన సభ్యుడుకు కూడా కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సికింద్రబాద్ శాసనసభ్యురాలు జయసుధ మొదట వైయస్ జగన్ వైపు వచ్చారు. ఆ తర్వాత తాను కాంగ్రెసుతోనే ఉంటున్నట్లు ప్రకటించి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పొగడేశారు కూడా. ఎన్నికలు సమీపించే నాటికి ఆమె ఎటువైపు ఉంటారనేది కూడా చెప్పలేని స్థితి. లోలోన ఇంకా ఎంత మంది జగన్ వైపు వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారనేది కూడా అంతు పట్టని విషయంగా ఉంది.
మజ్లీస్తో అవగాహన కారణంగానే పలువురు కాంగ్రెసు అభ్యర్థులు గత ఎన్నికల్లో హైదరాబాదులో విజయం సాధించారు. మజ్లీస్ మద్దతు లేకుండా హైదరాబాదులోని కొన్ని స్థానాల్లో విజయం సాధించడం ఏ మాత్రం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.