కోమటిరెడ్డి బ్రదర్స్జంప్: షర్మిల యాత్రనే ముహూర్తంగా
షర్మిల రూట్ మ్యాప్ను పూర్తిగా ప్రకటించలేదు. ఎప్పటికి అప్పుడు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పాదయాత్ర సాగుతోంది. త్వరలో తెలంగాణలో ఆమె అడుగు పెట్టనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ తెలంగాణ రూట్ మ్యాప్లో తలమునకలైంది. ఆమె నల్గొండ జిల్లాలోకి ప్రవేశించే సమయంలో కోమటిరెడ్డి సోదరులతో పాటు మరికొందరు జిల్లా స్థాయి టిడిపి, కాంగ్రెసు నేతలు కూడా ఆ పార్టీలో చేరనున్నారని సమాచారం.
పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వారి వెంటే వెళ్తారని ప్రచారం జరుగుతోంది. సోమవారం గుత్తా మాట్లాడుతూ... డిసెంబర్ 9వ తేది లోగా కాంగ్రెసు తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తాను ప్రజలందరూ కోరుకునే పార్టీలోకి వెళ్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లోని అర్థాన్ని పలువురు రెండు విధాలుగా అర్థం చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి లేదా తెరాసలోకి ఆయన చేరవచ్చునని అంటున్నారు.
నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరుల హవా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాగా కొనసాగింది. జిల్లాలో వారికి తిరుగులేకపోయేది. ఆయన మృతి తర్వాత వారి ఆధిపత్యానికి గండిపడింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లా కాంగ్రెసులో వారు క్రమంగా పట్టుకోల్పోయారు. అది ఇతరుల చేతుల్లోకి వెళ్లింది. అంతేకాకుండా వారికి వైయస్తో మంచి అనుబంధముంది.
వారు ఎప్పుడైనా జగన్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం తొలి నుండి జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. పలు సందర్భాలలో వైయస్ను పొగిడారు. ఇటీవల ఆ సోదరులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా.. కాంగ్రెసుకు వ్యతిరేకంగా మాటల దాడి పెంచారు. దీంతో వారు జగన్ వైపు వెళ్తారని అందరికీ అర్థమైపోయింది. షర్మిల పాదయాత్ర జిల్లాలోకి ఎంటర్ అయిన సమయంలోనే వారు ఆ పార్టీలో మరికొందరు నేతలతో కలిపి చేరుతారని భావిస్తున్నారు.