తెలంగాణ వేడి, జగన్ స్పీడు: కిరణ్పై సోనియా వెయిట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిజీ బీజీగా ఉన్నారు! రాష్ట్రంలో ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పీడుగా ఉండగా.. ఇంకోవైపు తెలంగాణ వేడి మళ్లీ రగులుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి బిజీగా ఉండటం ఏమిటా అంటే ఆయన బుజ్జగింపుల పర్వంలో బిజీగా ఉన్నారని అంటున్నారు. గురువారం నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఇదే అదనుగా భావించిన పలువురు అధికార పార్టీ అసంతృప్త ఎంపీలు అధిష్టానానికి తమ తమ బాధను వ్యక్తం చేసే పని పెట్టుకున్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్తో భేటీ తర్వాత కూడా ఆయన అసంతృప్తి తగ్గలేదు. ఈ రోజు కూడా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. విప్ జారీ చేసినా డోంట్ కేర్ అన్నారు. ఆయన తీరు చూస్తే పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డట్లుగా కనిపిస్తోంది. విప్ జారీ చేసినా ఆయన లెక్కచేయని పక్షంలో అధిష్టానం ఆయనపై వేటు వేసే ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. పార్టీయే కాదు.. మొదట ఆయనే రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో విప్ జారీ చేసినా కావూరి విషయంలో ఫలితం లేకుండా ఉంది.
ఇలాంటి అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతను, బరువును కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యమంత్రికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. కావూరిని సమావేశాలకు వెళ్లాల్సిందిగా కిరణ్ కోరినప్పటికీ ఆయన ససేమీరా అన్నారట. బుజ్జగింపులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. మరోవైపు తెలంగాణ ఎంపీలు సైతం విప్ను ధిక్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై అధిష్టానం తమకు హామీ ఇస్తే తప్ప అవిశ్వాసం పెట్టినా అండగా ఉండవద్దనే అభిప్రాయంతో ఉన్నారట.
వారి బాధ్యతను కూడా కిరణ్ భుజాన వేసుకున్నారట. అయితే అసలు తెలంగాణ కాంగ్రెసు ఎంపీలకు, కిరణ్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి నేతలను బుజ్జగించేందుకు కిరణ్ వారికి సన్నిహితంగా ఉండే వారిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి తమ పార్టీ ఎమ్మెల్యేల జంప్ వేడి హైదరాబాద్ నుండి ఢిల్లీకి తాకింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలలో సొంత పార్టీ ఎంపీల నుండి ఎలాంటి ఇబ్బందులు కాంగ్రెసుకు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే ఉన్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లోని భాగస్వామ్యపక్షాలతో, మన రాష్ట్రంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో అధిష్టానం పడింది. మరోవైపు పార్టీ వీడుతారని వచ్చే ఎమ్మెల్యేలను కూడా కిరణ్ బుజ్జగిస్తున్నారట.
పార్టీ వీడనున్నారనే ప్రచారం జరిగిన వారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డిని బుధవారం కలుసుకున్నారు. పార్టీ మారతారనే వార్తలు వచ్చిన మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మానకొండూరు ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలతో పాటు గొట్టిపాటి రవికుమార్, బాలూ నాయక్, ఉగ్రనరసింహా రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ తదితర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
వారి నుండి కిరణ్ పార్టీని విడిచి వెళ్లమనే స్పష్టమైన హామీ తీసుకుంటున్నారట. తాము పార్టీ వీడుతామనేది కేవలం ఊహాగానాలేనని, వాటిని ఉద్దేశ్య పూర్వకంగా ఇతర పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో చెప్పుకుంటున్నారట.












Click it and Unblock the Notifications