పూణేలోని యెరవాడ జైలులో కసబ్ను ఉరి తీశారు

కసబ్ మెర్సీ పిటిషన్ను రాష్ట్రపతి నవంబర్ 5వ తేదీన తోసిపుచ్చారు. ఆ వెంటనే రహస్యంగా కసబ్ను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి పూణేలోని యెరవాడ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. కసబ్ను ఉరి తీసే వరకు మొత్తం ప్రక్రియ అంతా అతి రహస్యంగా జరిగింది.
కసబ్తో పాటు మరో 9 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 166 మందిని చంపారు. ఎదురు కాల్పుల్లో మిగతా 9 మంది ఉగ్రవాదులు మరణించగా, కసబ్ మాత్రమే పట్టుబడ్డాడు. కసబ్ను బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు ఉరి తీసినట్లు మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ ధ్రువీకరించారు.
కసబ్కు ఉరిశిక్ష అమలు జరిగిందని, ఈ సందర్భంలో అమరవీరులను స్మరించుకుందామని ఆయన అన్నారు. న్యాయప్రక్రియ పూర్తయిన తర్వాతనే కసబ్కు ఉరిశిక్ష అమలు జరిగిందని చెప్పారు. కసబ్ను యెరవాడ జైలుకు రెండు రోజుల క్రితం తరలించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు.
పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు కసబ్కు ఉరిశిక్ష అమలైంది. కసబ్ను 2008 నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ సెల్లో ఉంచారు. హైకోర్టు 2010 అక్టోబర్ 10వ తేదీన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కసబ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
పాతికేళ్ల కసబ్కు ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు 2010 మే 6వ తేదీన తీర్పు ఇచ్చింది. ఎస్సై తుకారాం కసబ్ను ప్రాణాలతో పట్టుకున్న 18 నెలల తర్వాత ఈ తీర్పు వెలువడింది. మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కసబ్ మెర్సీ పిటిషన్ను సెప్టెంబర్లో తిరస్కరించి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చాలని సిఫార్సు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అక్టోబర్లో కోరింది.












Click it and Unblock the Notifications